విషాదం.. యుద్ధ ట్యాంకర్ పేలి ఇద్దరు సైనికులు మృతి

7 Oct, 2022 16:27 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలో విషాదం జరిగింది. సైనికులు ఏటా నిర్వహించే ఫీల్డ్ ఫైరింగ్ ఎక్సర్‌సైజ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఝాన్సీ సమీపంలోని బబినా కంటోన్మెంట్‌ ప్రాంతంలో విన్యాసాలు నిర్వహించే సమయంలో టీ-90 యుద్ధ ట్యాంకర్‌ బ్యారెల్‌ పేలింది. మూడో తరానికి చెందిన ఈ ట్యాంకర్‌ను రష్యా తయారు చేసింది 

ఈ దర్ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీవ్ర గాయాలైనప్పటికీ అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. .

పేలుడు జరిగిన సమయంలో ట్యాంకర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. కమాండర్, గన్నర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడని పేర్కొన్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సైనికాధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బుధవారం అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో తవాంగ్‌లో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ మరునాడే ఝాన్సీలో మరో ప్రమాదం జరిగి ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
చదవండి: వందే భారత్ రైలు ప్రమాదం.. గేదెల యజమానులపై కేసు

మరిన్ని వార్తలు