76 మందికి కరోనా.. ‘తాజ్‌’ మూసివేత

29 Mar, 2021 18:58 IST|Sakshi

డెహ్రాడూన్‌: మహమ్మారి కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. గతేడాది మాదిరి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఒకేసారి 76 మందికి పాజిటివ్‌ సోకడంతో ప్రముఖ హోటల్‌ ‘తాజ్‌’ మూతపడింది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నిర్వాహకులు హోటల్‌ను మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక ప్రాంతాలుగా ఉన్న రిశికేశ్‌, డెహ్రాడూన్‌లలో భారీగా కేసులు నమోదవుతుండడంతో కంటైన్‌మెంట్‌ జోన్లుగా అధికారులు ప్రకటించారు. 

హోటల్‌ను శానిటైజ్‌ చేశామని.. ముందు జాగ్రత్తలో భాగంగా మూసివేసినట్లు ఎస్పీ తృప్తి భట్‌ మీడియాకు చెప్పారు. రిషికేశ్‌లోని తాజ్‌ రిసార్ట్‌ అండ్‌ స్పాలో గత మంగళవారం 16 మంది ఉద్యోగులకు కరోనా వ్యాపించింది. దీంతో అప్రమత్తమైన నిర్వాహకులు పరీక్షలు భారీగా చేయించారు. ఈ క్రమంలో మరికొందరి పరీక్షలు నిర్వహించగా మొత్తం కేసులు కలిపి 76 మందికి మహమ్మారి వ్యాపించింది. దీంతో మరో మూడు రోజుల పాటు హోటల్‌ను మూసివేశారు. 

అయితే కొన్ని రోజుల్లో ఉత్తరాఖండ్‌లో జరగాల్సిన మహాకుంభమేళాకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సమయంలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఈ సందర్భంగా మేళాకు వచ్చేవారు కచ్చితంగా పరీక్షలు చేసుకోవాలని.. నెగటివ్‌ వస్తేనే అనుమతి ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు