Rajnath Singh On Afghanistan: అఫ్గాన్‌ పరిస్థితులు సవాల్‌గా మారాయి

29 Aug, 2021 17:02 IST|Sakshi

చెన్నై: తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు పెను సవాలుగా మారాయని, ఈ పరిస్థితుల్లో చాలా దేశాలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి వచ్చిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. తమిళనాడులోని వెల్లింగ్టన్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కళాశాలలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అఫ్గాన్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు భారత్‌ వ్యూహాన్ని మార్చాయని, దీనిపై పురాలోచిస్తున్నకేంద్రం త్వరలో కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తుందని తెలిపారు. 

కొత్త వ్యూహాలకు అనుగుణంగా ‘క్వాడ్‌’ ఏర్పడిందని, అందులో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ బాటిల్‌ గ్రూప్‌ ఏర్పాటును రక్షణ శాఖ పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఈ యుద్ధ బృందాలు వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు  యుద్ధ విభాగాలను సిద్ధం చేసి శత్రువులపై విరుచుకుపడతాయన్నారు. భారత యువత సైనికుల్లా దేశభక్తిని, క్రమశిక్షణను అలవర్చుకోవాలని,  అలాగే భారత సైన్యం సగటు వయసు తగ్గింపు అంశం పరిశీలనలో ఉందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన పాక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దాయాది దేశం ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు శిక్షణ ఇచ్చి భారత్‌పై ఎగదోస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొందని, భారత్‌ రక్షణాత్మక వైఖరిని వీడి ప్రతిస్పందించడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. 2016 బాలాకోట్ దాడులతో ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలిసి వచ్చిందని తెలిపారు.

చదవండి: ఆస్తుల నగదీకరణ ఎందుకు ?

>
మరిన్ని వార్తలు