గిఫ్ట్‌తో వధూవరులకు షాకిచ్చిన కమెడియన్‌: నవ్వులే నవ్వులు!

19 Aug, 2021 18:59 IST|Sakshi

చెన్నె: ప్రస్తుతం దేశంలో బంగారం మాదిరి పెట్రోలియం ధరలు పెరిగిపోతున్నాయి. నిరంతరాయంగా పెరుగుతున్న పెట్రోల్‌ ధర దేశంలోని పలు ప్రాంతాల్లో రూ.110కి చేరువగా ఉంది. ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలోనే ఓ ప్రముఖ హాస్య నటుడు పెట్రోల్‌ ధరల పెరుగుదలపై ఓ వినూత్న నిరసన మాదిరి చేశారు. నవ దంపతుల వద్దకు వెళ్లి ఓ కవర్‌ తీసి రెండు డబ్బాలు ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా వధూవరులతో పాటు బంధుమిత్రులు షాకయ్యారు. అనంతరం నవ్వుకున్నారు. ఆయన ఇచ్చింది ఏమిటో తెలుసా? ఐదు లీటర్ల పెట్రోల్‌. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: తనయుడి గిఫ్ట్‌కు తన్మయత్వంతో కన్నీళ్లు రాల్చిన తల్లి )

తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్య నటుడు మయీల్‌ సామి. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇటీవల జరిగిన ఓ వివాహానికి మయిల్‌ సామి హాజరయ్యాడు. కొత్త దంపతులను ఆశీర్వదించి కానుకగా పెట్రోల్‌ అందించాడు. ఈ ఫొటోలు ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. మయీల్‌ సామి చర్యను అందరూ అభినందిస్తున్నారు. మండుతున్న పెట్రోల్‌ ధరలపై ఇదో వింత నిరసన అని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలను తమిళ కాలమిస్ట్‌ మనోబాల విజయబాలన్‌ ట్వీట్‌ చేశారు. 

అనంతరం నటుడు మయీల్‌ సామి మీడియాతో మాట్లాడారు. పెట్రోల్‌ ధరలకు నిరసనలో భాగంగా పెళ్లి కానుకగా పెట్రోల్‌ ఇచ్చినట్లు తెలిపారు. అయితే సీఎం స్టాలిన్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రూ.3 తగ్గించడాన్ని అభినందించారు. దివంగత జయలలిత, ఎంజీ రామచంద్రన్‌కు వీరాభిమానిగా ఉన్న మయీల్‌ సామి సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటారు. గతంలో ఓ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 

చదవండి: కరెంట్‌ షాక్‌తో భర్తను ఆడుకున్న భార్య.. తీరా కట్టుకథ అల్లి

మరిన్ని వార్తలు