త్రిభాషా సూత్రాన్ని అంగీకరించం

4 Aug, 2020 03:46 IST|Sakshi

ద్విభాషా విధానాన్నే కొనసాగిస్తాం: తమిళనాడు సీఎం పళనిస్వామి

చెన్నై: జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)–2020లో కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులోని ఏఐఏడీఎంకే ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో అమలవుతున్న ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ‘ఎన్‌ఈపీలోని త్రిభాషా సూత్రం బాధాకరం, విచారకరం. ప్రధాని మోదీ ఈ విధానాన్ని పునఃసమీక్షించాలి’అని సీఎం పళనిస్వామి పేర్కొన్నారు.

రాష్ట్రంలో 8 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ద్విభాషా విధానం నుంచి వైదొలిగేది లేదని స్పష్టం చేశారు. ద్విభాషా విధానాన్నే కొనసాగించాలంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఆయన సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. కేంద్రం చెబుతున్న త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ఎప్పటికీ ఆమోదించబోదని కుండబద్దలు కొట్టారు.  5వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరపాలని ఎన్‌ఈపీ ప్రతిపాదించింది. అయితే, హిందీ, సంస్కృతాలను తమపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌ ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు