సిటీ బస్సులో సీఎం స్టాలిన్‌.. కాన్వాయ్‌ ఆపి మరీ..

23 Oct, 2021 20:11 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతున్నారు. తాజాగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని తనే స్వయంగా పరిశీలించడానికి శనివారం అకస్మాత్తుగా కాన్వాయ్‌ దిగి చెన్నైలోని కన్నగి నగర్‌ వైపు వెళ్తున్న సిటీ బస్సు ఎక్కారు. ఈ సందర్భంగా సీఎం బస్సులోని ప్రయాణికులతో సంభాషించారు.

చదవండి: (స్టాలిన్‌ సర్కారు సరికొత్త పథకం)

తమిళనాడులో అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణం గురించి ఎలా భావిస్తున్నారో స్టాలిన్‌ ప్రత్యేకంగా మహిళల్ని అడిగి తెలుసుకున్నారు. నగరంలో వివిధ బస్సు సర్వీసుల గురించి ఫిర్యాదులు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. బస్సుల్లో ఇంకా ఎటువంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. కరోనా నిబంధనల్ని పాటిస్తూ ప్రయాణాలు చేయాలని ప్రయాణికులకు సీఎం స్టాలిన్‌ సూచించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు సీఎంతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు.

చదవండి: (బంగారంతో పెట్టుబడి.. సీఎం​ స్టాలిన్‌ కీలక నిర్ణయం)

అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే 400 పేజీల మేనిఫెస్టోలో సిటీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రభుత్వ రంగంలోని మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఆరు నెలల నుంచి సంవత్సరానికి పెంచడం, ప్రసూతి సాయంగా రూ.24,000 అందించడం, మహిళలపై నేరాలను విచారించడానికి ప్రత్యేక సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు వంటి పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. 

మరిన్ని వార్తలు