బతికున్న మనిషి చనిపోయినట్లు నమ్మించి..

20 May, 2022 09:34 IST|Sakshi
బాధితులను విచారిస్తున్న పోలీసులు

30 ఎకరాల ఆస్తిని కాజేసిన వైనం

న్యాయం జరగలేదని ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం

తిరువళ్లూరు(చెన్నై): బతికి ఉన్న వృద్ధురాలు మృతి చెందినట్లు నమ్మించి 30 ఎకరాల ఆస్తిని కాజేసిన వారిపై చర్యలు తీసుకుని, తమ భూములను అప్పగించాలని ఒకే కుటుంబానికి చెందిన బాధితులు కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గురువారం వెలుగుచూసింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌ పుదువల్లూరు నయపాక్కం గ్రామానికి చెందిన పచ్చయప్పన్‌కు అదే గ్రామంలో 30 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి.

గత 40 ఏళ్ల క్రితం కుటుంబ తగాదాల కారణంగా పుదువల్లూరు నయపాక్కం నుంచి పాక్కంకు వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్ల క్రితం పచ్చయప్పన్‌ మృతి చెందాడు. అతని కుమారులు కృష్ణన్, రాజన్‌ కలిసి తహసీల్దార్‌ను సంప్రదించారు. అయితే అప్పటికే పట్టాభూమితో సంబంధం లేని ముగ్గురు వ్యక్తుల పేరిట మారినట్లు తెలిసి షాక్‌కు గురయ్యారు. పచ్చయప్పన్‌ భార్య మృతి చెందినట్లు తప్పుడు సమాచారం ఇచ్చి డెత్‌ సర్టిఫికెట్‌తో పాటు మొత్తం రికార్డులను మార్చేసి కబ్జా చేసినట్లు నిర్ధారించారు. దీంతో పచ్చయప్పన్‌ భార్య సుశీల, ఇద్దరు కొడుకులు, ఏడుగురు కుమార్తెలు కలిసి తిరువళ్లూరు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్‌తో సహా పలువురు ఉన్నతాధికారులకు గత ఏడేళ్లుగా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. న్యాయం జరగకపోవడంతో ఆవేదన చెందిన వారు గురువారం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు.  

చదవండి: భార్యను కాటు వేసిన కొండచిలువ.. భర్త ఏం చేసాడంటే?

మరిన్ని వార్తలు