చెన్నై: తమిళనాడులోని సేలం జిల్లాలో 12వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. విద్యార్థి మృతికి కారణం స్కూల్ యజమాన్యమే కారణమని ఆరోపిస్తు ఆమె కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. అంతేగాక పలువురు గ్రామ ప్రజలు వందల సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని ఆ విద్యార్థికి న్యాయం చేయాలంటూ నిరసనలు చేశారు. పైగా వారంతా స్కూల్లోని ఫర్నీచర్ని ధ్వంసం చేయడమే కాకుండా పోలీసు వాహనాలను కూడా తగలు బెట్టారు.
దీంతో తమిళనాడులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ స్కూల్ కెమిస్ట్రీ టీచర్ హరిప్రియ, మ్యాథమెటిక్స్ టీచర్ కృతికను అరెస్ట్ చేశారు. అదీగాక ఆ విద్యార్థి తీవ్రగాయాలు, రక్తస్రావం కారణంగా చనిపోయిందని పోస్ట్మార్టం నివేదిక పేర్కొంది. ఈ కేసుకి సంబంధించి ప్రిన్సిపాల్, స్కూల్ మేనేజ్మెంట్ అధికారులతో సహా ఇప్పటి వరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ విద్యార్థి ఉపాధ్యాయుల వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ విషయమై సీఎం స్టాలిన్ కూడా స్పందించి నిరసనలు శాంతియుతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ విద్యార్థి మృతిపై సత్వరమే విచారణ జరిపించడమే కాకుండా నిందితులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు కూడా.
(చదవండి: తమిళనాడులో టెన్షన్.. టెన్షన్.. స్కూల్ బస్సులను తగలబెట్టారు: సీఎం వార్నింగ్)