ప్రేయసి వస్తుందని ఆశతో 21 ఏళ్లుగా ఎదురు చూసి చూసి.. చివరకు

10 Aug, 2021 15:44 IST|Sakshi

ప్రేమ అనేది ఓ మధురమైన అనుభూతి, భావాలు తప్ప మాటల్లో వర్ణించలేని వర్ణన. అందుకే ప్రేమికులు తమ ప్రేమను కాపాడుకోవడం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంటారు. కొందరు ఆ ప్రేమ కోసం ప్రాణాలు తీసుకుంటే, మరికొందరు జీవితాల్ని నాశనం చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలా ఓ యువకుడు తాను ప్రేమించిన యువతి కోసం ఒకటి రెండేళ్లు కాదు ఏకంగా 21ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు.

ఈ ఘటన తమిళనాడులోని పుదుకోట్టైలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.... పుదుకోట్టై జిల్లాలోని పొన్నమరావతి సమీపం మూలక్కుడి గ్రామానికి చెందిన నాగరాజన్‌ (40) 21ఏళ్ల క్రితం ఉపాధి కోసం కేరళకు వెళ్లి అక్కడ ఓ యువతిని ప్రేమించాడు. తన తోబుట్టువులకు పెళ్లి అయ్యాక వివాహం చేసుకుందామని చెప్పి ఆమెను మూలక్కుడికి తీసుకొచ్చాడు. 

అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి ఆమెను బలవంతంగా తీసుకువెళ్లారు. ఈ ఘటనతో షాకైన నాగరాజన్ తన ప్రియురాలు ఎప్పటికైనా  తిరిగి వస్తుందన్న ఆ పరిసరాల్లోనే రోడ్డు మీద తిరుగుతూ ఆశగా ఎదురుచూసేవాడు. ఈ క్రమంలో ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోవడంతో నాగరాజు మతిస్థిమితం తప్పింది. అలా ఏళ్లుగా నిరీక్షిస్తున్న అతడి విషయం ఇటీవలే జిల్లా అధికారులకు తెలిసింది. దీంతో వారు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సాయంతో అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు