నాన్న ఆశీర్వాదం కోసం... రూ. 6 లక్షల విగ్రహం

3 Feb, 2021 11:25 IST|Sakshi

తండ్రి విగ్రహ సమక్షంలో కుమార్తె వివాహ రిసెప్షన్‌

సాక్షి, చెన్నై: తండ్రిపై సాధారణంగా కుమార్తెలకు ప్రేమ కాస్త ఎక్కువే. ఆడపిల్ల తన జీవితంలోని ప్రతి కీలక దశలో నాన్న తోడుగా ఉండాలని కోరుకుంటుంది. ముఖ్యంగా వివాహ సమయంలో తండ్రిని ఎక్కువగా గుర్తు చేసుకుంటుంది. ఒకవేళ దురదృష్టం కొద్ది తండ్రి.. ​కుమార్తె వివాహానికి ముందే మరణిస్తే.. ఆ బాధ వర్ణనాతీతం. తమిళనాడుకుచెందిన అక్కాచెల్లెళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. సోదరి వివాహంలో తండ్రి తమతో లేడన్న బాధను మరిచేందుకు ఆయన విగ్రహాన్ని తయారు చేయించారు ఆ అక్కాచెల్లెళ్లు. ఆ విగ్రహం సమక్షంలో తన చిన్న చెల్లెలి వివాహ రిసెప్షన్‌ వేడుకను జరిపించారు. ఆ వివరాలు.. తమిళనాడు తంజావూరు జిల్లా పట్టుకోట్టైకు చెందిన సెల్వం పెద్ద పారిశ్రామిక వేత్త. ఆయనకు భార్య కళావతి, భువనేశ్వరి, దివ్య, లక్ష్మి ప్రభ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి అంటే కుమార్తెలకు ఎనలేని ప్రేమ.  ఇందులో చిన్న కుమార్తె లక్ష్మీప్రభ ఆ తండ్రికి గారాల పట్టి. భువనేశ్వరి, దివ్యలకు ఎనిమిదేళ్ల క్రితమే అత్యంత వేడుకగా వివాహాన్ని జరిపించాడు. 
(చదవండి: ఒకప్పుడు కారడివి.. కానీ ఇప్పుడు..)

ఆనందంగా సాగుతున్న వారిపై విధి చిన్న చూపు చూసింది. 2012లో సెల్వం మరణించాడు. తండ్రి మరణం కుమార్తెల్ని కలచి వేసింది. ఈ పరిస్థితుల్లో తండ్రికి గారాల పట్టిగా ఉన్న లక్ష్మీప్రభ వివాహ రిసెప్షన్‌ సోమవారం రాత్రి పట్టుకోట్టైలోని ఓ వివాహ వేదికలో జరిగింది. ఈ వివాహంలో తండ్రి లేడన్న లోటు లక్ష్మీప్రభకు తెలియకూడదని అక్కయ్య భువనేశ్వరి, బావ కార్తిక్‌ భావించారు. ఇందుకోసం బెంగళూరులోని ఓ సంస్థ ద్వారా తండ్రి నిలువెత్తు సిలికాన్‌ విగ్రహాన్ని తయారు చేయించారు. రూ. 6 లక్షలు వెచ్చించి సిలికాన్‌తో 5 అడుగులు 7 అంగుళాల ఎత్తుతో రూపొందించిన విగ్రహాన్ని కల్యాణ వేదికపైకి తీసుకొచ్చారు. దీంతో తండ్రి తన పెళ్లికి వచ్చి ఆశీర్వదించినంత ఆనందంలో ఉబ్బితబ్బిబ్బు అయిపోయింది. వధూవరులు ఇద్దరు ఆ విగ్రహం సమక్షంలో పూలమాలల్ని మార్చుకున్నారు
 

మరిన్ని వార్తలు