ఫుడ్‌ డెలివరీ ఏజెంట్‌గా టీసీఎస్‌ ఉద్యోగి.. ఆ తర్వాత ఏమైందంటే..?

7 Apr, 2022 09:11 IST|Sakshi

TCS Techie Turns Zomato, సాక్షి, చెన్నై: అతనో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతున్న క్రమంలో ఓ వారం గ్యాప్‌ దొరికింది. ఇంతలో ఆ వారం రోజులు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని జొమాటో ఫుడ్​ డెలివరీ ఏజెంట్​గా పార్ట్‌ టైమ్‌ జాబ్‌ను ఎంచుకున్నాడు. అప్పుడు మొదలయ్యాయి ఆయన తిప్పులు. ఈ క్రమంలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా చేయడం ఎంత కష్టమో వివరించారు. ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

టీసీఎస్ మాజీ ఉద్యోగి, తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్​ జయరామన్.. జాబ్‌కు రిజైన్‌ చేసి మరో కంపెనీలో చేరాడు. కొత్త కంపెనీలో జాయినింగ్‌ కోసం ఓ వారం గ్యాప్‌ తీసుకున్నారు. ఆ వారం రోజులు ఖాళీగా ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఫుడ్‌ డెలివరీ ఏజెంట్‌గా మారాడు. ఈ క్రమంలో జొమాటో, స్విగ్గీ ద్వారా ఫుడ్​ డెలివరీ చేసే వాళ్ల కష్టాలను స్వయంగా అనుభవించి.. ఇబ్బందుల గురించి లింక్డ్‌​ ఇన్​లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో పెట్రోల్​ ధరలు మొదలుకొని స్పీడ్​గా ఫుడ్​ డెలివరీ చేయడం వరకు సమస్యల జాబితాను తయారు చేసి వివరించాడు. 

పోస్ట్‌ ప్రకారం.. డెలివరీ ఏజెంట్లు త్వరగా డెలివరీ ఇవ్వడానికి కాలంతోపాటు పరుగెత్తాలి. చాలా మంది కస్టమర్లు తమ అడ్రస్​లను కరెక్ట్​గా చెప్పరు. లొకేషన్​ వివరాలు సరిగ్గా ఉండవు. ఫోన్​ నంబర్లను అప్​డేట్​ చేయరు. ఒక రద్దీ ప్రాంతంలో గంటలో మూడు ఫుడ్​ పార్సిళ్లను డెలివరీ చేయాల్సి వచ్చిందని జయరామన్​ వివరించాడు. తరచుగా డెలివరీ కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య. తాను ఓ సారి ఏకంగా 14 కిలో మీటర్లు ప్రయాణించి డెలివరీ ఇవాల్సి వచ్చిందని తెలిపాడు. గూగుల్స్‌ మ్యాప్స్‌ సాయంతో కొన్ని సార్లు అడ్రస్‌లు సరిగా తెలియవు. 

ఇటీవల కాలంలో పెరుగుతున్న పెట్రోల్‌ ధరల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘డెలివరీ ఏజెంట్లకు సాయం చేయండి. పెరిగిన పెట్రోల్​ ధరలను కంపెనీలే భరిస్తాయనే వార్తలను చూశాను. అది నిజమైతే చాలా బాగుంటుంది. వాళ్లను తప్పక ఆదుకోవాలి” అని చెప్పాడు. కాగా, ఇటీవలే ఇక నుంచి తాము కొన్ని ఆహార పదార్థాలను పది నిమిషాల్లోనే డెలివరీ ఇస్తామని జొమాటో సీఈఓ దీపిందర్​ గోయల్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో డెలివరీ విషయంలో ఉద్యోగులపై ఒత్తిడి చేయమని వివరణ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు