టీకొట్టు వ్యాపారికి రూ.109 కోట్ల జీఎస్టీ!

17 Dec, 2020 10:18 IST|Sakshi
టీ కొట్టులో కార్తీక్‌ కమిల  

భువనేశ్వర్‌: రెక్కాడితే డొక్కాడని జీవులకు రాష్ట్రంలో ఇటీవల ద్రవ్య సేవా పన్ను(జీఎస్‌టీ) బకాయి తాఖీదులు జారీ అవుతున్నాయి. తాజాగా టీకొట్టు వ్యాపారికి ఈ తరహాలో నోటీసు జారీ అయ్యింది. ద్రవ్య సేవా పన్ను జీఎస్‌టీ బకాయి కింద రూ.109 కోట్లు జమ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. ఉక్కునగరం రౌర్కెలా కోయల్‌నగర్‌ ప్రాంతంలో టీకొట్టు వ్యాపారి కార్తీక్‌ కమిల రూ.109 కోట్ల జీఎస్‌టీ చెల్లించాల్సి ఉన్నట్లు తెలిపారు. వాస్తవానికి కార్తీక్‌ సంతకం చేయలేని నిరక్షరాశ్యుడు. అయితే బడా షాపింగ్‌మాల్‌ యజమానిగా జీఎస్‌టీ వర్గాలు పేర్కొన్నాయి. ఒప్పంద పత్రాల సంతకాలతో భవంతి అద్దెకు నడుపుతున్నట్లు దీనిలో వివరించారు. చదవండి: ఒకే రోజు 12 వేల మందికి జరిమానా 

సంతకం కూడా రాదు.. 
కార్తీక్‌ రౌర్కెలా కోయల్‌నగర్‌ లింగరాజ్‌ ట్రేడింగ్‌ కంపెనీ షాపింగ్‌మాల్‌ ఆవరణలో టీకొట్టు నడుపుకుంటున్నాడు. అలాగే కూరగాయల చిల్లర వ్యాపారం చేస్తుంటాడు. వీటితో చేతికి అందిన చిరు మొత్తంతో కుటుంబం నడుపుకుంటున్న సాదాసీదా వ్యక్తి. సంతకం చేయడం రాని నిరక్షరాశ్యుడు. ఈ వ్యక్తిని ట్రేడింగ్‌ కంపెనీ యజమానిగా, భారీ భవంతి అద్దెకు నడుపుతున్నట్లు పేర్కొని, నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం బుధవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది.

జీఎస్‌టీ ఎగవేత తాఖీదులో పేర్కొన్న లింగరాజ్‌ ట్రేడింగ్‌ కంపెనీ షాపింగుమాల్‌ ఆవరణలో టీకొట్టు, అక్కడే కూరగాయలు అమ్ముకుంటున్న వ్యక్తి కార్తీక్‌ కమిలగా విచారణలో తేలింది. విచారణలో పలు అంశాలను సమీక్షించడంతో తాఖీదులో వివరాలు బూటకమని స్పష్టమైంది. కార్తీక్‌ విద్యుత్‌ బిల్లులు దాఖలు చేసి, ఈ బూటకపు జీఎస్‌టీ తాఖీదు జారీ చేయించినట్లు భావిస్తున్నారు. గతంలో ఆటో డ్రైవర్లు, కార్మికులు, విద్యార్థులు, చిరు వ్యాపారులకు జీఎస్‌టీ చెల్లింపునకు తాఖీదులు జారీచేసిన ఘటనలు లేకపోలేదు. ఇటువంటి సందర్భాలు రాష్ట్రంలో జీఎస్‌టీ లోలోపల భారీ కుంభకోణాలు పేరుకుపోతున్నట్లు సందిగ్ధత వ్యక్తం అవుతోంది.
 

మరిన్ని వార్తలు