బీసీ క్రీమీలేయర్‌ రద్దు చేయాలి

23 Mar, 2022 01:48 IST|Sakshi
ఢిల్లీలో మీడియా సమావేశంలో జాజుల తదితరులు 

అఖిల భారత ఓబీసీ ఉద్యోగుల ఫెడరేషన్‌ జాతీయ సమావేశంలో వక్తలు 

సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు క్రీమీలేయర్‌ను విధించి, రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలుకాకుండా అడ్డుకుంటున్నారని, తక్షణమే క్రీమీలేయర్‌ను రద్దు చేయాలని అఖిల భారత బీసీ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా దేశ జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు కేవలం 18% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయన్నారు. అఖిల భారత బీసీ ఉద్యోగుల ఫెడరేషన్‌ నేతృత్వంలో ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జాతీయస్థాయి సమావేశం మంగళవారం జరిగింది.

బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు, ఓబీసీ పార్లమెంటు సభ్యుల ఫోరం మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు, మహారాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ తైవాడే, బీసీ సెంట్రల్‌ కమిటీ చైర్మన్‌ భాగ్యలక్ష్మి, ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి కరుణానిధి, అఖిల భారత ఓబీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కిరణ్‌ సహా పలువురు పాల్గొని ప్రసంగించారు.

దేశంలో వెంటనే బీసీ జనగణన చేపట్టాలని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసి బీసీల సంక్షేమానికి కనీసం రూ. లక్ష కోట్లు కేటాయించాలని వక్తలు కోరారు.  జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టులో కనీసం లక్షమందితో ఢిల్లీ్లలో బీసీల మహాప్రదర్శన చేపట్టాలని నిర్ణయించినట్లు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపా రు. సమావేశానికి దానకర్ణచారి, పాండు మల్లేష్‌ సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

మరిన్ని వార్తలు