Yasin Malik: ఉగ్ర నిధుల కేసులో యాసిన్‌ మాలిక్‌ దోషే 

20 May, 2022 07:49 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు అందించిన కేసులో కశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ను దోషిగా తేలుస్తూ గురువారం ఢిల్లీలోని ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నెల 25న అతనికి శిక్ష ఖరారు చేయనున్నట్టుగా వెల్లడించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లోని 16, 17, 18, 20 సెక్షన్ల ప్రకారం యాసిన్‌ మాలిక్‌కు గరిష్టంగా మరణశిక్ష కాగా, కనిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష పడేందుకు అవకాశాలున్నాయి.  

యాసిన్‌ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి తెలిపితే తదనుగుణంగా జరిమానా విధిస్తామని ఎన్‌ఐఏని కోర్టు ఆదేశించింది. మాలిక్‌ కూడా తన ఆదాయాన్ని అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. జమ్మూ కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(జేకేఎల్‌ఎఫ్‌)పేరుతో యాసిన్‌ మాలిక్‌ ఏర్పాటు చేసిన ఉగ్ర సంస్థను కేంద్రం నిషేధించింది. స్వాతంత్య్ర పోరాటం పేరుతో కశ్మీర్‌ లోయలో మాలిక్‌ నిధులు పెద్ద ఎత్తున సేకరించి, ఉగ్ర సంస్థలకు అందించాడు.
చదవండి: జీవితంలో మూడేళ్లు వృథా

మరిన్ని వార్తలు