రెచ్చిపోయిన ఉగ్రవాది.. నడి రోడ్డుపై కాల్పులు

19 Feb, 2021 14:19 IST|Sakshi

శ్రీనగర్‌లో  రెచ్చిపోయిన ఉగ్రవాది

ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుల్స్‌ మృతి

శ్రీనగర్‌‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పట్టపగలు, నడి రోడ్డుపై కాల్పులకు తెగ బడ్డారు. దుకాణం వద్ద నిలబడి ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులకు తెగ బడ్డాడు ఓ ఉగ్రవాది. శ్రీనగర్‌ భగత్‌ బర్జుల్లా ప్రాంతంలో శుక్రవారం ఈ దారుణం చోటు చేసుకుంది. జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కానిస్టేబుల్స్ సోహైల్ అహ్మద్, మహ్మద్ యూసుఫ్‌ బర్జుల్లాలోని ఓ టీ స్టాల్‌ వద్ద నిల్చుని ఉన్నారు. ఇంతలో నడుచుకుంటూ వచ్చిన ఓ ఉగ్రవాది తన వద్ద ఉన్న ఏకే-47 తుపాకీతో కాల్పులకు తెగ బడ్డాడు.

ఊహించని ఈ ఘటనకు చుట్టు పక్కల ఉన్న స్థానికులు త్రీవ భయందోళనకు గురయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాది అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటన గురించి తెలిసి ఆర్మీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్స్‌ సోహైల్ అహ్మద్, మహ్మద్ యూసుఫ్‌లు మరణించారు. అక్కడే ఉన్న సీసీకెమరాలో ఉగ్రవాది దాడి చేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. శ్రీనగర్‌లో మూడు రోజుల వ్యవధిలో ఉగ్రవాదులు ఇలా బరి తెగించడం ఇది రెండో సారి. నగరంలోని హై సెక్యూరిటీ దుర్గానాగ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ యజమాని కొడుకుపై మూడు రోజుల క్రితం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

మరిన్ని వార్తలు