Kashmiri Pandit: మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కశ్మీరీ పండిట్‌పై కాల్పులు..

26 Feb, 2023 14:27 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కశ్మీరీ పండిట్‌ లక్ష‍్యంగా దాడికి తెగబడ్డారు. పుల్వామా అచాన్ ప్రాంతంలో ఆదివారం ఉదయం మార్కెట్‌కు వెళ్తున్న సంజయ్ శర్మపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

సంజయ్ శర్మ ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్యతో కలిసి ఆదివారం ఉదయం 10:30 గంటలకు మార్కెట్‌కు వెళ్తుండగా ముష్కరులు అతనిపై దాడి చేశారని పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ దాడిని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. సంజయ్ శర్మ మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈమేరకు ట్వీట్ చేశారు.

కశ్మీర్‌ పండిట్లను లక్ష‍్యంగా చేసుకుని ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడుతున్నారు. గతేడాది మైనారిటీ వర్గాలకు చెందిన 14 మంది కాల్చి చంపారు. వీరిలో ముగ్గురు కశ్మీరీ పండిట్లు ఉన్నారు.
చదవండి: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి.. అద్దాలు ధ్వంసం..

మరిన్ని వార్తలు