హత్రాస్‌‌‌ ఉదంతం.. పోలీసుల ఎదుటే బెదిరింపులు

5 Oct, 2020 20:10 IST|Sakshi

నిందితులకు మద్దతుగా నిలిచిన ఠాకూర్లు

లక్నో: హత్రాస్‌ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాధితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మీడియాలో ఒక వీడియో తెగ వైరలవుతోంది. ఠాకూర్ల సామాజిక వర్గానికి చెందిన కొందరు ఎలాంటి భయం లేకుండా.. పోలీసుల ఎదుటే భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ను బెదిరించారు​. ఇక యోగి ప్రభుత్వం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే వారికి అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. 144 సెక్షన్‌ విధించారు. గుంపులు గుంపులుగా చేరడాన్ని నిషేధించారు. చివరకు రాహుల్‌ గాంధీ, ప్రియాంకలను కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిండానికి వెళ్లిన భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌తో పాటు మరో 400 మందిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కానీ దారుణానికి పాల్పడిన నిందుతులకు మద్దతుగా 500 వ్యక్తులు చేరడమే కాక ఆజాద్‌ను బహిరంగంగా హెచ్చరించారు. అయితే పోలీసులు వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. (చదవండి: బాధిత కుటుంబంపై కేసు పెట్టాలి)

దీనిపై ఆజాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిందితులకు మద్దతుగా ఎలాంటి సమావేశాలు జరిపినా చర్యలు ఉండవు. బాధితురాలి కుటుంబం ప్రమాదంలో ఉంది. వారికి ప్రత్యేక భద్రత కల్పించండి’ అని డిమాండ్‌ చేశారు. ఇక గ్రామంలోని ఉన్నత కులస్తులు రాష్ట్రీయ సావర్న్‌ పరిషత్‌ అధ్వర్యంలో సమావేశం అయ్యారు. బాధితురాలి కుటుంబం సదరు వ్యక్తుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. యోగి ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. కానీ వారు మాత్రం నమ్మడం లేదు. రాజకీయాలు చేయడానికి ఇక్కడకు వచ్చారంటూ చంద్రశేఖర్‌ ఆజాద్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఓ వ్యక్తి ‘దెబ్బలను తట్టుకునేందుకు ఠాకూర్లు పుట్టారు.. బయటకు రండి మీ పెద్ద సోదరులు మిమ్మల్ని కలవడానికి ఇక్కడ ఉన్నారు రండి’ అంటూ భీమ్‌ ఆర్మీ నాయకుడిని ఆహ్వానించారు. 

మరిన్ని వార్తలు