ట్విటర్‌ ట్రెండింగ్‌లో డోలో 650.. జలుబు, జ్వరం, కరోనా.. ఏదైనా అదేనా?.. పరాచికాలొద్దంటూ హెచ్చరిక

8 Jan, 2022 09:51 IST|Sakshi

Dolo 650 Twitter Trending: ‘సొంత వైద్యం’.. కరోనా టైంలో ఎక్కువ చర్చకు వచ్చిన అంశం. అయితే ఆరోగ్యానికి అంత మంచిది కాదనే వైద్య నిపుణుల సలహాలను పాటించిన వాళ్లు కొందరైతే.. తమకు తోచింది చేసుకుంటూ పోయినవాళ్లు మరికొందరు!. వాట్సాప్‌ యూనివర్సిటీ ప్రచారమో, మరేయితర కారణాల వల్లనో ఇంటి వైద్యానికే ఎక్కువ ప్రాధాన్యం లభించింది ఫస్ట్‌ వేవ్‌ టైంలో.  అదే సమయంలో అల్లోపతి మందులకు ఫుల్‌ డిమాండ్‌ నడిచిన విషయమూ చూశాం. మూడో వేవ్‌ ముప్పు తరుణంలో మళ్లీ ఇప్పుడా పరిస్థితి నెలకొంది.  


అసలే ఫ్లూ సీజన్‌. ఆపై కరోనా ఉధృతి. తాజాగా లక్షాయాభై వేలకు కొత్త కేసులు చేరువైన వైనం. కేసులు ఒక్కసారిగా పెరిపోతుండడంతో జనాల్లోనూ ఆందోళన పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో జ్వరం, ఇతర ట్యాబెట్లు, సిరప్‌ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. డోలో మాత్రపై ట్విటర్‌లో సరదా-సీరియస్‌ కోణంలో కొనసాగుతున్న ట్రెండ్‌ ఇందుకు నిదర్శనం. 

డోలో 650 మేనియా.. అవును ఇప్పుడిది ట్విటర్‌ను షేక్‌ చేస్తోంది. ప్రమోషనో లేదంటే ట్విటర్‌ యూజర్ల అత్యుత్సాహామో తెలియదుగానీ నిన్నటి నుంచి ట్విటర్‌లో పోస్టులు పడుతూనే ఉన్నాయి. జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు.. ఎలాంటి లక్షణం కనిపించినా డోలో మాత్ర వేసుకుంటే సరిపోతుందని భ్రమలో మునిగిపోయారు చాలామంది. కొవిడ్‌ టెస్టులకువెళ్లకుండానే ఈ మాత్రతో తగ్గిపోతుందనే ఉద్దేశంతో  ఏదో చాక్లెట్‌ చప్పరించినట్లు డోలో మాత్రల్ని వేసుకుంటున్నారు. దీనిపై సోషల్‌ మీడియా రెండుగా విడిపోయింది. విచ్చిల విడిగా వాడడం మంచిదికాదని.. వాడితే తగ్గిపోతుందని ఎవరికి తోచిన ట్వీట్లు వాళ్లు చేసుకున్నారు. ఈ దెబ్బతో ట్విటర్‌ టాప్‌ ట్రెండింగ్‌లో #Dolo650 నడుస్తోంది. అందులో కొన్ని పోస్టులు..  


ప్రొడక్షన్‌ పెరిగింది
ఫ్లూ సీజన్‌లో సాధారణంగా ట్యాబెట్లు వాడే జనం, కరోనా ఫియర్‌తో ఈసారి అడ్డగోలుగా మందుల్ని వేసుకుంటున్నారు. కరోనా ఫస్ట్‌ వేవ్‌ టైంలో జ్వరం, గొంతు ఇన్‌ఫెక్షన్‌ మాత్రలకు ఫుల్‌ గిరాకీ నడిచిన విషయం తెలిసిందే. అయితే రెండో వేవ్‌ సమయానికి వ్యాక్సిన్‌ రావడంతో ఆ వ్యవహారం కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు వ్యాక్సినేషన్‌ పూర్తైనా కరోనా బారిన పడుతున్నారనే అంశం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పాత చిట్కాలను పాటించడంతో పాటు మెడిసిన్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన ఈ డిమాండ్‌ను పసిగట్టి మరోవైపు మందుల కంపెనీలు సైతం ప్రొడక్షన్‌ను పెంచుతున్నాయి.  


వైద్యుల కీలక ప్రకటన
అయితే ‘అన్నింటికి ఒకే మందు’ అంటూ సోషల్‌ మీడియాలో సాగుతున్న ఈ వ్యవహారాన్ని వైద్యులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.  ఏ మందు అయినా అవసరం ఉన్నప్పుడు.. అవసరం మేరకే వాడాలి. అంతేకానీ ముందు జాగ్రత్త, సొంత ట్రీట్‌మెంట్‌ పేరుతో వాడితే సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా అవసరం లేకున్నా వాడడం వల్ల బాడీలో ‘డ్రగ్‌ రెసిస్టెన్స్‌’ పెరిగి..  అవసరమైనప్పుడు మందులు  పనిచేయకుండా పోతాయని చెప్తున్నారు.  

ఒమిక్రాన్‌కానీ, ఇంకేదైనా వేరియెంట్‌గానీ కరోనా వైరస్‌ను  తేలికగా తీసుకోవద్దు. 

కరోనా అవునో కాదో తెలియకుండా ట్యాబ్లెట్లు వేసుకోవడం మంచిదికాదు. 

ఎవరో ఒకరిద్దరికి తగ్గిందనే భ్రమతో వైద్యుల పర్యవేక్షణ లేకుండా మందులు వాడడం ప్రాణాల మీదకు తెస్తుంది. 

సోషల్‌ మీడియా ప్రచారాన్ని అస్సలు నమ్మొద్దు.. వైద్యులను నమ్మండి

లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా కావాలి.  జాగ్రత్తలు పాటించాలి.  ఆకలి లేకపోవడం, ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవడం, ఆసుపత్రికి వెళ్లడం లేదంటే డాక్టర్ సలహాను తీసుకోవడం మంచిది. 

కరోనా సోకినా భయపడాల్సిన అవసరం లేదు. చికిత్సకు మనోధైర్యం తోడైతే కొవిడ్‌-19 వ్యాధిని అధిగమించొచ్చు. 

అవసరమైతే టెలికాన్సల్టేషన్ ద్వారా కూడా డాక్టర్‌ను సంప్రదించొచ్చు. 

టీకాలతో ఏం ఒరగట్లేదనే ఆలోచన మంచిది కాదు. అవి వ్యాధులనుంచి రక్షణ కలిగిస్తాయి. రోగ నిరోధకశక్తిపై దీర్ఘకాలం పనిచేస్తాయి. కాబట్టి, వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉండకూడదు. 

అనుమానంతో పదేపదే కరోనా టెస్టులు చేయించుకుంటూ ఇబ్బంది పడొద్దు. కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురిచేయొద్దు.

అన్నింటికి మించి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శుభ్రత తదితర జాగ్రత్తలతో కరోనాను జయించొచ్చు.

మరిన్ని వార్తలు