కరోనా వ్యాక్సిన్‌ అనుకొని ఎత్తుకెళ్లారు.. ట్విస్ట్‌ ఏంటంటే

28 May, 2021 15:47 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలోని థానేలోని ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లోకి  గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 300 వివిధ రకాల వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లారు. వారు ఎత్తుకెళ్లిన వాటిలో ఎక్కువ శాతం చిన్న పిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్లు ఉన్నట్లు తెలిసింది. కాగా అధికారులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తులు హెల్త్‌ సెంటర్‌లో యాంటీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఏమైనా ఉందేమోనని... ముఖ్యంగా కోవిషీల్డ్‌ దొంగలించడానికి చొరబడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనికి తోడు వ్యాక్సిన్స్‌పై ఉన్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ స్టిక్కర్లను తీసేసి అక్కడే వదిలేసి వెళ్లారు. కాగా వచ్చిన వ్యక్తులు ఎలాంటి ఆధారాలు ఉండకూదని సీసీ కెమెరాలతో పాటు మానిటర్‌ను తమ వెంట తీసుకెళ్లారు . కాగా సెక్షన్‌ 380, సెక్షన్‌ 427,సెక్షన్‌ 454 కింద ఆ వ్యక్తులపై  కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా ఈరోజు ఉదయం విధుల్లో చేరేందుకు వచ్చిన పీహెచ్‌సీ ఉద్యోగులు హెల్త్‌ సెంటర్‌లో ఫ్రిజ్‌ డోర్‌ పగులగొట్టి ఉండడం... వ్యాక్సిన్‌ ట్రేలు చెల్లాచెదరుగా పడి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. '' ఈరోజు ఉదయం రాగానే ఫ్రిజ్‌ డోర్‌ తాళం విరిగి ఉండడంతో వ్యాక్సిన్‌ స్టాక్‌ను తనిఖీ చేశాము. సాధారణంగా మాకు కోవిడ్‌-19 వ్యాక్సిన్లు వస్తుంటాయి. కానీ గత శుక్రవారం నుంచి మా హెల్త్‌ సెంటర్‌కు ఎలాంటి కరోనా వ్యాక్సిన్లు రాలేదు. ప్రస్తుతం చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్లు ఎక్కువగా ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్‌ అని భావించి వాటిని ఎత్తుకెళ్లి ఉంటారు.పిల్లల వ్యాక్సిన్లలో అందుబాటులో ఉన్న 40 శాతం నిల్వలను ఎ‍త్తుకెళ్లారు'' అని పీహెచ్‌సి వైద్య అధికారి డాక్టర్ దీపక్ చావా తెలిపారు.
చదవండి: Covid-19: పుక్కిలించిన సెలైన్‌తో కరోనా టెస్ట్‌

మరిన్ని వార్తలు