Nupur Sharma Row: మోదీ ఇలాకాలో నూపుర్‌ శర్మ పోస్టు కలకలం.. వ్యాపారిని చంపేస్తామంటూ బెదిరింపులు

16 Jul, 2022 09:06 IST|Sakshi

మహ్మాద్‌ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపర్‌ శర్మ వ్యాఖ్యలు పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా హింసాత్మక ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. 

కాగా, తాజాగా నూపుర్‌ శర్మ విషయంలో మరో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన ఇన్‌స్టాగ్రామ్‌లో నూపుర్‌ శర్మ ఫొటోను పోస్టు చేశాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారికి ఏడుగురు వ్యక్తులు కాల్‌ చేసి చంపేస్తామని బెదిరించారు. సూరత్‌లో ఉండాలనుకుంటున్నావా లేదా.. చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. 

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు ఉమ్రా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జేఆర్ చౌదరి తెలిపారు. ఇక, అదుపులోకి తీసుకున్న వారిలో మహ్మద్ అయాన్ అటాష్‌బాజివాలా, రషీద్ భురా, అలియా మహ్మద్ అనే మహిళ ఉన్నారు. ఇక, వీరంతా సూరత్ నివాసితులుగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.  అనంతరం.. సదరు వ్యాపారవేత్త వెంటనే సోషల్‌ మీడియా ఖాతా నుంచి నూపుర్‌ శర్మ ఫొటోను తొలగించి, క్షమాపణలు చెప్పాడు.

ఇది కూడా చదవండి: తమిళనాట రాజకీయ చదరంగం: పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి

మరిన్ని వార్తలు