పాకిస్తాన్‌లోకి బ్రహ్మోస్‌ క్షిపణులు మిస్‌ఫైర్‌.. ముగ్గురు వాయుసేన అధికారులపై వేటు

23 Aug, 2022 20:25 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోకి పొరపాటున బ్రాహ్మోస్ క్షిపణులను ప్రయోగించిన ముగ్గురు వాయుసేన అధికారులను విధుల నుంచి తొలగించింది కేంద్రం. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనపై న్యాయ విచారణ అనంతరం మంగళవారం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం విధుల నుంచి తొలగించిన అధికారుల్లో ఓ గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్‌, స్క్వాడ్రన్‌ లీడర్ ఉన్నారు. 

భారత వాయుసేన తాజాగా చెప్పిన వివరాల ప్రకారం ఈ ముగ్గురు అధికారులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(SOP)లో చేసిన పొరపాటు వల్లే క్షిపణులు ప్రమాదవశాత్తు పాకిస్తాన్‌ భూభాగంలో పడ్డాయి.

మార్చి 9న జరిగిన ఈ ఘటన అనంతరం బ్రాహ్మోస్ క్షిపుణులు తమ భూభాగంలో పడ్డాయని పాకిస్తాన్‌ భారత్‌కు సమన్లు పంపి నిరసన వ్యక్తం చేసింది. అయితే సాంకేతిక లోపం వల్లే క్షిపణులు పొరపాటున పాక్‌లో పడినట్లు భారత్ వివరణ ఇచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదనే విషయాన్ని ప్రస్తావించింది.
చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే‌.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే!

మరిన్ని వార్తలు