భారత్‌కు రానున్న మరో మూడు రఫెల్‌ యుద్ధ విమానాలు

31 Mar, 2021 14:21 IST|Sakshi

కొచ్చి: భారత వాయుసేనకు సేవలందించేందుకుగాను ఫ్రాన్స్‌ నుంచి  కొత్తగా మరో మూడు  రఫెల్‌ యుద్ధ విమానాలు బుధవారం రోజు రానున్నాయి. ఈ యుద్ధవిమానాలు రాత్రి 7 గంటలకు గుజరాత్‌లో ల్యాండ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఇవి అంబాలాలోని గోల్డెన్ ఆరోస్‌ స్క్వాడ్రన్‌ శిబిరంలో  చేరనున్నాయి. రఫెల్‌ యుద్ధవిమానాలు ఫ్రాన్స్ నుంచి నేరుగా భారత్‌కు రానున్నాయి. యూఏఈ మధ్యలో గాల్లోనే మిడ్‌-ఎయిర్‌ రీ ఫ్యూలింగ్‌ చేసుకుంటాయి.  వీటి చేరికతో స్క్వాడ్రన్‌లోని యుద్ధ విమానాల సంఖ్య 14 కు చేరనుంది.

కాగా,  తొమ్మిది రాఫెల్ ఫైటర్ జెట్ల తదుపరి బ్యాచ్ ఏప్రిల్‌లో రానుంది. వీటిలో ఐదింటిని  పశ్చిమ బెంగాల్‌లోని హషిమారా ఎయిర్‌బేస్‌లో చేర్చుతారు.ఏప్రిల్ చివరి నాటికి ఐదు అదనపు రాఫెల్ జెట్లను భారత్‌కు వస్తాయని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ మంగళవారం పేర్కొన్నారు.  కొచ్చిలో ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. కోవిడ్‌-19 మహామ్మారి ఉన్నప్పటికీ అనుకున్న సమయంలో యుద్ధ విమానాలను సరఫరా చేశామని తెలిపారు.

రాఫెల్ ఫైటర్ జెట్‌ రెండు ఎమ్‌88-3 సఫ్రాన్ ఇంజన్లను కలిగి ఉంది. ఈ ఇంజన్లు సుమారు  73 కిలో న్యూటన్ల థ్రస్ట్‌ను ఇ‍వ్వగలవు. అంతేకాకుండా  స్మార్ట్ ఆయుధ వ్యవస్థను కలిగి ఉంది. ఈ యుద్ధ విమానం గత ఏడాది జూలై, ఆగస్టులలో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్ లో చేరాయి. అతి తక్కువ సమయంలో వైమానిక దళం వీటి ఆపరేషన్‌కు అనుమతులు లభించాయి.తూర్పు లడఖ్, ఇతర ప్రాంతాలలో, పెట్రోలింగ్ కోసం మోహరించారు. 2016 సెప్టెంబరులో ఫ్రాన్స్ నుంచి  36 యుద్ధ విమానాలను భారత్ ఆర్డర్‌చేసిన విషయం తెలిసిందే.

చదవండి: ‘గోల్డెన్‌‌ గర్ల్‌’ శివాంగి సింగ్‌

మరిన్ని వార్తలు