మళ్లీ కరోనా కలకలం.. ఆఫ్‌లైన్‌ క్లాస్‌లు నిలిపివేత

11 Apr, 2022 12:16 IST|Sakshi

A school in Uttar Pradesh’s Ghaziabad suspended offline classes: కరోనా ముప్పు తగ్గలేదని జాగ్రత్తగా ఉండాల్సిందేనంటూ వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ చెబుతోంది. మరోవైపు కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌కి సంబంధించిన మ్యూటెంట్‌ కేసులు ముంబైలో నమోదవ్వడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అదీగాక ప్రధాని నరేంద్ర మోదీ సైతం కోవిడ్‌ ముప్పు ముగిసిపోయిందని అనుకోవడానికి వీల్లేదని జాగ్రత్తగ ఉండాలని పేర్కొన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వైశాలిలో కేఆర్‌ మంగళం వరల్డ్ స్కూల్‌లో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో ఒక్కసారిగా స్కూల్‌ యజమాన్యం ఆఫ్‌లైన్‌ క్లాస్‌లను నిలిపేసింది. ఈ మేరకు స్కూల్‌ యాజమాన్యం రెండు రోజులపాటు ఆఫ్‌లైన్‌ క్లాస్‌లను నిషేధించడమే కాకుండా ఆన్‌లైన్‌ మోడ్‌లోనే క్లాస్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

అంతేగాదు విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా తల్లిదండ్రులు కోవిడ్‌ ప్రోటోకాల్‌ని పాటించాలని పిలుపునిచ్చింది. ఇటీవలే ఘజియాబాద్‌లోని ఒక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి మరువక ముందే కొద్దిరోజుల్లోనే మరో ఘటన వెలుగు చూసింది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు తెరవాలని, యథావిధిగా తరగతులకు ప్రారంభించాలని ఆదేశించడం గమనార్హం.

(చదవండి: కరోనా ముప్పు తొలగలేదు)

మరిన్ని వార్తలు