'హిందూ ధర్మాన్ని బీజేపీ ఏమైనా లీజుకు తీసుకుందా?'

8 Jul, 2022 16:10 IST|Sakshi

బెంగాల్‌: కాళీమాతపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. బీజేపీపై విమర్శలతో విరుచకుపడ్డారు. హిందూ ధర్మాన్ని ఆ పార్టీ ఏమైనా లీజుకు తీసుకుందా? అని ప్రశ్నించారు. ఏం చేయాలో కమలం పార్టీ ఇతరులకు ఎందుకు బోధిస్తోందని నిలదీశారు.. బెంగాలీ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ తన ఎజెండాను, అభిప్రాయాలను బలవంతంగా ఇతరులపై రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఇతరులు దీన్ని ప్రతిఘటించి దేశం కోసం ఒక్కసారి మాట్లాడాలి' అని మహువా అన్నారు.

బీజేపీ తన సొంత వెర్షన్‌ హిందూయిజాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపింపజేయాలని చూస్తోందని మహువా మెయిత్రా ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‍లోని హిందువులు వందల ఏళ్లుగా సుస్థిరమైన ఆచారాలను పాటిస్తున్నారని గుర్తు చేశారు. కాళీమాతను ఇలానే పూజించాలని బీజేపీ చెప్పడమేంటన్నారు. శ్రీరాముడు, హనుమంతుడు కేవలం ఆ పార్టీకే చెందినవారు కాదన్నారు.

హిందుత్వ రాజకీయాలను బలవంతంగా తమపై రుద్దాలని చూసిన బీజేపీని బెంగాల్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని మహువా అన్నారు. కాళీమాతను ఎలా పూజించాలో ఆ పార్టీ తనకు చెప్పొద్దని, 2000 ఏళ్లుగా తాము ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నామని అన్నారు.
చదవండిTMC Mahua Moitra: మాంసం తినే మద్యం తాగే దేవత

మరిన్ని వార్తలు