దుర్గామాత పూజలో పాల్గొన్న ఎంపీ నుస్రత్‌

24 Oct, 2020 13:39 IST|Sakshi

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ దుర్గాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణతో భర్త నిఖిల్‌ జైన్‌తో కలిసి కోల్‌కతాలోని సురుచి సంఘ మంటపం వద్ద సందడి చేశారు. దుర్గామాతకు హారతి ఇచ్చిన ఎంపీ దంపతులు, పూజారుల ఆశీస్సులు తీసుకుని అమ్మవారి అనుగ్రహం పొందారు. ఆ తర్వాత నిఖిల్‌ డోలు వాయిస్తుండగా, నుస్రత్‌ అక్కడున్న మహిళలతో కలిసి కాలుకదిపారు. అనంతరం తాను సైతం డోలు వాయిస్తూ మంటపంలో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా గతేడాది సైతం నుస్రత్‌ ఇదే విధంగా దుర్గామాత పూజలో పాల్గొనగా కొంతమంది ఓ వర్గం ఆమెపై ట్రోలింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. ఇస్లాం మతాచారాలను అగౌరవపరిచి, తమ మనోభావాలు దెబ్బతీశారంటూ మండిపడ్డారు. (చదవండి: చంపుతామంటున్నారు..)

ఇక బెంగాలీ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నుస్రత్‌ జహాన్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. టర్కీకు చెందిన వ్యాపారవేత్త నిఖిల్‌ జైన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. బసిర్‌హాట్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నుస్రత్‌, తనకు సంబంధించిన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటారు. 

మరిన్ని వార్తలు