డ్రైవర్‌తో ఆరేళ్ల ప్రేమ! కిడ్నాప్‌ కాదు.. ఇష్టపడే పెళ్లి, మంత్రికి షాక్‌ ఇచ్చిన కూతురు!

9 Mar, 2022 08:43 IST|Sakshi
మంత్రి శేఖర్‌తో కూతురు జయకళ్యాణి(ఎడమ), కుడివైపు మీడియాతో కొత్త జంట

ప్రేమించిన వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకున్న యువతి.. ప్రాణ భయంతో పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమె పక్క రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి కూతురని తేలడంతో పోలీసులు కంగుతిన్నారు. హై ప్రొఫైల్‌ కేసుగా ఇప్పుడిది మీడియాకు ఎక్కింది. 


ట్విస్టుల మీద ట్విస్టుల తర్వాత.. తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు కుమార్తె డాక్టర్‌ జయకళ్యాణి ప్రేమవివాహం చేసుకుంది. బెంగళూరులోని ఓ హిందూ ధార్మిక సంస్థలో సోమవారం సతీష్‌ను ఆమె వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఆరేళ్లుగా తాము ప్రేమించుకున్నామని, పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఈ పని చేశామని జయకళ్యాణి వివరణ ఇచ్చింది. అయితే తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఈ కొత్త జంట.. బెంగళూరు సిటీ కమిషనర్‌ కమల పంత్‌ను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు.

కిడ్నాప్‌ కేసు!

కూతురు కనిపించకుండా పోయేసరికి మంత్రి శేఖర్‌, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురిని ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ అందులో పేర్కొన్నారు. దీంతో మంత్రి కూతురి కిడ్నాప్‌ తమిళ మీడియాలో హెడ్‌లైన్స్‌గా మారింది. ఇంకోపక్క పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. ఈ లోపు పక్క రాష్ట్రంలో పోలీసుల ముందు ప్రత్యక్షమై ట్విస్ట్‌ ఇచ్చింది జయకళ్యాణి.  

బంధించారు.. వేధించారు
సతీష్‌ ఆ ఇంటి డ్రైవర్‌. పైగా దళితుడు. కొన్ని నెలల క్రితం జయకళ్యాణిని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రి మంత్రి శేఖర్‌ను అడిగాడు. డ్రైవర్‌, పైగా కులాంతర వివాహం కావడంతో మంత్రి ఒప్పుకోలేదు. పైగా సతీష్‌ను రెండు నెలల పాటు తమిళనాడు పోలీసుల సాయంతో అక్రమంగా నిర్బంధించాడు కూడా. ఇందుకు సంబంధించి గతంలో సతీష్‌ రిలీజ్‌ చేసిన ఓ వీడియో మీడియా వైరల్‌ అయ్యింది. అయితే ఇప్పుడు తాము మేజర్లు అయినందున పెళ్లి చేసుకున్నామని తెలిపింది జయకళ్యాణి.

The News Minute సౌజన్యంతో వీడియో

తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని తమ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని.. కాబట్టి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు ఆమె మీడియా ముందు పోలీసులను వేడుకుంటోంది. కాగా తమిళనాడు హిందూ రెలిజియస్‌ అండ్‌ ఛారిటబుల్‌ ఎండోమెంట్‌ మినిస్టర్‌ అయిన శేఖర్‌బాబు.. సీఎం స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా.

మరిన్ని వార్తలు