లైంగికంగా వేధించాడు: మహిళా ఐపీఎస్‌ ఫిర్యాదు

24 Feb, 2021 19:35 IST|Sakshi

చెన్నై : స్పెషల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌( లా అండ్‌ ఆర్డర్‌) తనను లైంగికంగా వేధించాడంటూ తమిళనాడుకు చెందిన మహిళా ఐపీఎస్‌ అధికారి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వివరాల ప్రకారం..విధుల్లో ఉన్న తనపై రాజేష్‌ దాస్‌ అనే స్పెషల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ లైంగికంగా వేధించాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని మహిళా ఐపీఎస్‌ అధికారి ఫిర్యాదు చేసింది. ఇటీవల పలు జిల్లాల్లో ముఖ్యమంత్రి పళనిస్వామి పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు బాధితురాలు పేర్కొంది. దీంతో పీఎం మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించి చేపట్టిన భద్రతా సమావేశాల్లో సదరు డీజీపీని పాల్గొనకుండా సస్పెండ్‌ చేసినట్లు రాష్ట్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ పుదుచ్చేరి, తమిళనాడులో పర్యటించనున్నారు. మరికొన్ని వారాల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్‌ విడుదల కానుంది.

ఇక బాధితురాలి ఫిర్యాదుతో ప్రణాళిక, అభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి జయశ్రీ రఘునందన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు స్వయంగా ఓ ఐపీఎస్‌ అధికారి లైంగిక వేధింపులకు గురికావడం చాలా బాధకరమైన ఘటన అని ప్రతిపక్ష నేత, డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ విమర్శించారు. నిందితుడిని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది చాలా సిగ్గుచేటని పేర్కొన్నారు. అదే సమయంలో ఫిర్యాదు చేసిన మహిళా ఐపీఎస్‌ అధికారిని ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. 

చదవండి : (ఎంపీ ఆత్మహత్య: 15 పేజీల లేఖ, వైరలవుతోన్న వీడియో)
(పెళ్లి పేరుతో రూ.11కోట్లకు నకిలీ ఐపీఎస్‌ మోసం)


 

మరిన్ని వార్తలు