Traffic Police: ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేస్తున్నారా.. ఇక వారి ఆటలు సాగవు

27 Jul, 2022 07:46 IST|Sakshi

బనశంకరి: కర్నాటకలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై నిఘా కోసం అమర్చిన ఆటోమేటిక్‌ నంబరు ప్లేట్‌ రికగ్నిషన్‌ (ఏఎన్‌పీఆర్‌) కెమెరాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వీటి ద్వారా 3 లక్షల 90 వేల పెండింగ్‌ కేసులను కనిపెట్టారు. అతిక్రమణదారుల నుంచి రూ. 21 కోట్లు జరిమానాలను వసూలు చేశారు.  

మార్చి నుంచి అమల్లోకి  
బెంగళూరు నగరంలో అధిక వాహనాల రద్దీ కలిగిన జంక్షన్లు, ప్రముఖ వాణిజ్య ప్రాంతాల్లో  ట్రాఫిక్‌ పోలీసుల ప్రమేయం లేకుండా సంచార వ్యవస్థ నిర్వహణ కోసం ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 చోట్ల ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు అమర్చారు. అప్పటి నుంచి జూలై 19 వరకు రోజుకు సరాసరి 2,765 ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కేసులను గుర్తించారు. చలానాలు కట్టకుండా తిరుగుతున్న వాహనాలు అనేకం దొరికాయి. అలా 3.90 లక్షల పెండింగ్‌ కేసులను కనిపెట్టారు.  

ఎలా పనిచేస్తాయంటే  
అత్యాధునిక పరిజ్ఞానంతో ఇవి పనిచేస్తాయి. ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు అమర్చిన మార్గాల్లో సంచరించే వాహనాల నంబరు ప్లేట్లపై కెమెరాలు నిఘాపెడతాయి. ఆ నంబరుతో వాహనాలు నియమాల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే నమోదు చేసి తక్షణం సమీపంలోని ట్రాఫిక్‌ పోలీస్‌ సిబ్బంది మొబైల్‌కు మెసేజ్‌ పంపుతుంది. దీని ఆధారంగా పోలీసులు సదరు వాహనం దగ్గరికి రాగానే వాహనదారున్ని అడ్డుకుని కేసు రాసి జరిమానా వసూలు చేస్తున్నారు.  

రాష్ట్రమంతటా ఏర్పాటు?  
ఈ కెమెరాలను అమర్చడంతో ట్రాఫిక్‌ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇదే తరహా కెమెరాలు అమర్చాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో  ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు అమరుస్తున్నారు. ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు ట్రాఫిక్‌ నిబంధన ఉల్లంఘన, పాత కేసుల ఆచూకీ కనిపెట్టడంతో పాటు చోరీకి గురైన వాహనాలను కనిపెట్టేందుకు సాయపడతాయని జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ (ట్రాఫిక్‌) బీఆర్‌ రవికాంతేగౌడ తెలిపారు. 

69 చలానాలతో దొరికాడు  
సుమారు 69 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడి జరిమానా చెల్లించని బైకిస్టు కోరమంగల 6వ బ్లాక్‌  80 ఫీట్‌ రోడ్డులో అమర్చిన ఏఎన్‌పీఆర్‌ కెమెరా సమీపంలో దొరికాడు. అతని గురించి ట్రాఫిక్‌ పోలీసుల మొబైల్‌కు మెసేజ్‌ రావడంతో నిఘా వేసి పట్టుకున్నారు. నేను హెల్మెట్‌ పెట్టుకున్నాను, సక్రమంగా నడుపుతున్నా, ఎందుకు వాహనాన్ని అడ్డుకున్నారని వాగి్వవాదం చేశాడు. అతని వాహన రిజి్రస్టేషన్‌ నంబరు ఆధారంగా పరిశీలించగా గతంలో 69 సార్లు ట్రాఫిక్‌ రూల్స్‌ని అతిక్రమించినట్లు నమోదై ఉంది. రూ.34,600 జరిమానాలు ఉన్నట్లు వెల్లడైంది. 

ఇది కూడా చదవండి: ఇదీ లక్కంటే.. అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టగా రూ.కోటి లాటరీ

మరిన్ని వార్తలు