గుజరాత్‌లో భూకంపం..రిక్టర్‌ స్కేలుపై..

11 Feb, 2023 14:34 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. సూరత్‌ జిల్లాలో శనివారం తెల్లవారు జామున రిక్టర్‌స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం నమోందైందని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిస్మొలాజికల్‌ రీసెర్చ్‌(ఐఎస్‌ఆర్‌) అధికారులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి తరువాత 12.52 నిమిషాలకు భూమి కంపించినట్లు వెల్లడించారు. సూరత్‌లోని పశ్చిమ నైరుతి తీరాన  27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొన్నారు.

భూ ప్రకంపనలు 5.2 కిలోమీటర్ల లోతులో నమోదయ్యాయి. భూకంప కేంద్రం జిల్లాలోని హజీరా తీరాన అరేబియా సముద్రంలో ఉంది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరగలేదని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం.. రాష్ట్రం అధికంగా భూకంప ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956, 2001లలో గుజరాత్‌లో భారీ భూకంపాలు చోటుచేసుకున్నాయి.

2001 కచ్ భూకంపం గత రెండు శతాబ్దాల్లో భారత్‌లో సంభవించిన మూడవ అతి పెద్ద, రెండో అత్యంత విధ్వంసక భూకంపం. ఆ సమయంలో 13,800 మందికి పైగా మరణించారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు. కాగా ఈ వారంలోనే టర్కీ, సిరియాలో భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఎత్తైన భవనాలు పేకమేడల్లా కూలిపోవడంతో వాటి శిథిలాలకింద చిక్కుకొని అనేకమంది ప్రాణాలు విడిచారు. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు 20 వేలు దాటింది. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
చదవండి: కాంగ్రెస్‌ ఎంపీ రజనీపై సస్పెన్షన్‌ వేటు

మరిన్ని వార్తలు