భళిభళిరా.. బలి

24 May, 2022 10:23 IST|Sakshi
బలి జాతరకు పొలాల్లోంచి తరలి వస్తున్న జనం

అంగరంగా వైభవంగా బలిజాతర 

ఇసుకలో విత్తనాలు చల్లి, పంటల దిగుబడిని పరిశీలించిన గిరిజనులు 

జయపురం(భువనేశ్వర్‌): సబ్‌ డివిజన్‌ పరిధిలోని కుంద్రా గ్రామంలో ఇసుక పండగ(బలి జాతర)ను సోమవారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో పరిసర గ్రామాలకు చెందిన గ్రామ దేవతల లాఠీలు పాల్గొన్నాయి. ఈ  నేపథ్యంలో ఏర్పాటు చేసిన మార్కెట్‌ వద్ద వివిధ రకాల వస్తువులు, ఆహార పదార్థాల కొనుగోలుకు జనం ఆసక్తి చూపారు. గ్రామీణ వ్యవసాయ రంగంలో బలి జాతరకు అధిక ప్రాధాన్యమిస్తారు. అవిభక్త కొరాపుట్‌ జిల్లాలో ఆదివాసీలు జరుపుకొనే ప్రధాన పండుగల్లో ఇది కూడా ఒకటి. వర్షాకాలం ప్రారంభానికి సూచికగా బలి జాతర చేపట్టడం విశేషం.

ఖరీఫ్‌ కాలంలో ఏ పంటలు వేస్తే ఉత్తమ దిగుబడులు సాధించవచ్చో తెలుసుకొకనే సూచికగా బలిజాతర జరపడం ఆనవాయితీ. పండగ కోసం ఆదివాసీ దిసారి(పూజారులు) మంచి రోజు నిర్ణయిస్తారు. ఆ రోజు మిగతా గ్రామాల దేవతలకు పూజలు చేసి, ఆమె ప్రతినిధిగా లాఠీ(జెండా)లతో వెదురుబుట్ట పట్టుకుని సమీపంలోని నదికి వెళ్తారు. నదిలో ఇసుకను గ్రామానికి తీసుకు వచ్చి, గ్రామదేవత గుడి ప్రాంగణంలో ప్రతిష్టించి, ఇళ్ల నుంచి సేకరించిన వివిధ రకాల విత్తనాలను ఇసుక బుట్టలో వేస్తారు. మొలకెత్తిన విత్తనాలు పరిశీలించి, బాగా మొలకెత్తిన పంట విత్తనాలు ఖరీఫ్‌ కాలంలో వేస్తే అధిక దిగుబడి సాధించవచ్చని అభిప్రాయానికి వచ్చారు. ఈ ఇసుక పండగకు వివిధ గ్రామాల ప్రజలను ఆహ్వానించారు.

చదవండి: భారత్‌కు మంకీపాక్స్‌ ముప్పు.. ఇలా అనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే!


 

మరిన్ని వార్తలు