ప్రణబ్‌కు ప్రముఖుల నివాళి

1 Sep, 2020 06:08 IST|Sakshi

‘‘ప్రణబ్‌ ముఖర్జీ ఒక దిగ్గజం. మాతృదేశానికి యోగిలాగా సేవ చేశారు. భరతమాత ప్రియతమ పుత్రుడి మరణానికి దేశమంతా దుఃఖిస్తోంది. ఆధునికతను, సాంప్రదాయంతో మేళవించిన మనీషి భారత రత్న ప్రణబ్‌. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.’’
– రాష్ట్రపతి రామ్‌నా«థ్‌ కోవింద్‌

‘‘దేశం ఒక పెద్దమనిషిని కోల్పోయింది. కష్టించే గుణం, క్రమశిక్షణ, అంకితభావంతో ఆయన కిందిస్థాయి నుంచి దేశంలో రాజ్యాంగబద్ధమైన అత్యున్నత స్ధాయికి ఎదిగారు. సుదీర్ఘ ప్రజాసేవలో ఆయన నిర్వహించిన ప్రతిపనికీ గౌరవం తెచ్చారు. ఓం శాంతి.’’
– ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

‘‘2014లో ఢిల్లీకి నేను వచ్చినప్పటినుంచి ప్రణబ్‌ దార్శనికత, ఆయన ఆశీస్సులు నాకు మద్దతుగా నిలిచాయి. ఆయనతో అనుబంధం ఎప్పటికీ గుర్తుంటుంది. రాష్ట్రపతి భవన్‌ను వైజ్ఞానిక, శాస్త్రీయ, సాంస్కృతిక కేంద్రంగా ఆయన మార్చారు. కీలక విధాన నిర్ణయాల్లో ఆయన సలహాలను ఎన్నటికీ మరువలేను. దేశ అభివృద్ధి పథంలో ఆయన ముద్ర స్పష్టంగా ఉంటుంది. ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన్ని అన్ని రాజకీయ పక్షాలు గౌరవించేవి. సమాజంలో అన్ని వర్గాల అభిమానం చూరగొన్న వ్యక్తి భారతరత్న ప్రణబ్‌’’
– ప్రధాని నరేంద్ర మోదీ

‘‘ప్రణబ్‌ చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. అన్ని రాజకీయ పక్షాలనేతలతో సుహృద్భావనతో మెలిగేవారు. అంకితభావంతో దేశానికి సేవ చేశారు. ఐదుదశాబ్దాలుగా అటు దేశం, ఇటు కాంగ్రెస్‌ పార్టీ పయనంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన లేని లోటు తీర్చలేదని, ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు ఎంతో అమూల్యమైనవి.’’
– కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ

‘‘ప్రణబ్‌ లేరన్న వార్త తీవ్ర విచారం కలిగించింది. ఆయన మరణంతో స్వతంత్ర భారతావనికి చెందిన ఒక గొప్పనాయకుడిని దేశం కోల్పోయింది. ఆయనతో కలిసి ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఆయన మేధస్సు, విజ్ఞానం, వివిధ ప్రజా విషయాలపై ఆయన అనుభవం నుంచి ఎంతో నేర్చుకున్నాను.’’    
– మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌  

‘‘ప్రణబ్‌ ముఖర్జీ మృతి తీవ్ర వేదన కలిగిస్తోంది. అంకిత భావంతో దేశానికి సేవ చేసిన అనుభవజ్ఞుడు. ఆయన సుదీర్ఘ ప్రజా జీవిత ప్రయాణం దేశానికే గర్వకారణం. దేశ రాజకీయ యవనికపై ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఓం శాంతి.’’  
 – హోం మంత్రి అమిత్‌షా


‘‘ భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణం బాధాకరం. దేశానికి ఆయన అనేక రూపాల్లో అంకితభావంతో సేవలనందించారు. అన్నిపార్టీలు ఆయన మేధస్సును గౌరవించేవి.’’    
– బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా

‘‘ ప్రణబ్‌ ముఖర్జీ లేరన్న వార్తతో దేశం తీవ్రవేదన చెందింది. దేశప్రజలతో పాటు ఆయనకు నా నివాళి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’’    
– కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ

‘‘ దేశప్రయోజనాలకే ప్రణబ్‌ పెద్దపీట వేసేవారు. రాజకీయ అస్పృశ్యతను ఆయన దరిచేరనీయలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆయన ఒక మార్గదర్శి. సంఘ్‌కు ఆయన లేని లోటు పూడ్చలేనిది.’’
– ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

‘‘ ప్రణబ్‌ ముఖర్జీ ఒక పరిపూర్ణ పెద్దమనిషి. ఆయనతో ఎంతో అనుబంధం ఉండేది. ఆయన మృతికి నా నివాళి.’’
    – లతా మంగేష్కర్‌
 
‘‘ భారత్‌ ఒక దిగ్గజ రాజకీయవేత్తను, గౌరవనీయుడైన నాయకుడిని కోల్పోయింది.’’  
 – అజయ్‌దేవగన్‌

‘‘దశాబ్దాలుగా ప్రణబ్‌ దేశానికి సేవలనందించారు.ఆయన మృతి తీవ్ర విచారకరం.’’    
– సచిన్‌ టెండూల్కర్‌

‘‘ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి నా సానుభూతి.’’    
– విరాట్‌కోహ్లీ   

>
మరిన్ని వార్తలు