Tripura Assembly Election: 45 మంది కోటీశ్వరులు, 41 మందిపై క్రిమినల్‌ కేసులు

9 Feb, 2023 05:53 IST|Sakshi

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులపై ఏడీఆర్‌ నివేదిక  

అగర్తాలా: త్రిపుర అసెంబ్లీకి ఈ నెల 16న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న 259 మంది అభ్యర్థుల్లో 45 మంది కోటీశ్వరులని, 41 మంది క్రిమినల్‌ కేసులున్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. కోటీశ్వరుల్లో అధికార బీజేపీకి చెందిన అభ్యర్థులు 17 మంది ఉంటే, టిప్రామోతాకి చెందిన వారు తొమ్మిది మంది, సీపీఐ(ఎం) అభ్యర్థులు ఏడుగురు ఉన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఆరుగురు కోట్లకు పడగలెత్తితే, తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన వారు నలుగురు ఉండగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా కోటీశ్వరులేనని ఆ నివేదిక చెప్పింది. త్రిపుర ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్‌ వర్మ రూ.15.58 కోట్ల ఆస్తులతో అత్యంత ధనికుడిగా ఉంటే  రూ.13.90 కోట్ల ఆస్తిపాస్తులతో  రాష్ట్ర ముఖ్యమంత్రి , డాక్టర్‌ కూడా అయిన మాణిక్‌ సాహ నిలిచారు. ఇక 41 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్‌ కేసులున్నాయని అఫిడివిట్లో దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 13 మంది అభ్యర్థుల్లో ఏకంగా ఏడుగురిపై క్రిమినల్‌ కేసులున్నాయి.

మరిన్ని వార్తలు