సెల్ఫ్ ఐసోలేషన్‌లో త్రిపుర ముఖ్య‌మంత్రి

4 Aug, 2020 08:33 IST|Sakshi

అగ‌ర్త‌లా: తమ కుటుంబ స‌భ్యుల్లో ఇద్ద‌రికి క‌రోనా సోక‌డంతో తాను స్వీయ నిర్భంధంలోకి వెళ్తున్న‌ట్లు త్రిపుర సీఎం విప్లవ్ కుమార్  తెలిపారు. త‌నకు నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్షా ఫ‌లితాలు ఇంకా వెలువ‌డ‌లేద‌ని దీంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా హోం ఐసోలేష‌న్‌లోకి వెళుతున్న‌ట్లు వెల్ల‌డించారు. అన్ని జాగ్ర‌త్తలు తీసుకుంటున్నాన‌ని పేర్కొన్న విప్ల‌వ్ దేవ్.. కుటుంబ‌స‌భ్యుల ఆరోగ్యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ సీఎం ట్వీట్ చేశారు. రాష్ర్టంలో క‌రోనా బాధితుల సంఖ్య 1742కు చేరింది. ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులకు సైతం క‌రోనా సోకుతున్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్టు 2న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు క‌రోనా నిర్దార‌ణ అయ్యింది. నూత‌న విద్యా విధానంపై చ‌ర్చించ‌డానికి గ‌త‌వారం జరిగిన స‌మావేశానికి షా హాజ‌ర‌య్యారు. దీంతో ప‌లువురు మంత్రులు సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్నారు. (18 లక్షల పైమాటే)

ఇక కర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డియూరప్ప‌, ఆయ‌న కుమార్తెల‌కు సైతం క‌రోనా సోకింది. ప్ర‌స్తుతం య‌డియూర‌ప్ప‌ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. దేశంలో ఇప్పటిదాకా మొత్తం క‌రోనా కేసులు 18,03,695, మరణాలు 38,135కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలియజేసింది. ఇదిలా ఉండగా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై రెండు, మూడో దశల హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించేందుకు డీసీజీఐ అనుమతించింది.

మరిన్ని వార్తలు