వైరల్‌: అతిథిలా వచ్చిన కలెక్టర్‌.. వధూవరులపై కేసు నమోదు

28 Apr, 2021 14:50 IST|Sakshi

అగర్తల: దేశంలో కరోనా విజృంభిస్తూ వీర విహారం చేస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించడం, సమావేశాలతో పాటు పలు కార్యక్రమాలకు జరుపుకునే విషయంలో ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిమిత సంఖ్యలోనే ప్రజలు వేడుకలు జరుపుకోవాలని స్పష్టంగా చేప్తున్నాయి. అయితే ఎవరు ఎంత చెప్తున్నా కొందరు మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తూ కరోనా కేసులు పెరగడానికి పరోక్షంగా కారణమవుతున్నారు. ఓవైపు సామాన్య ప్రజలు కరోనా మహమ్మారితో హడలిపోతుంటే త్రిపురలోని రెండు కుటుంబాలు వారి పెళ్లి వేడుకలను ఆడంబరంగా, భారీ జనసందోహంతో జరపుకున్నారు. కోవిడ్‌ నిబంధనలు మరిచి పెళ్లి వేడుకలను చేసుకుంటున్న ఆ జంటలపై వెస్ట్‌ త్రిపుర కలెక్టర్‌ అడ్డుకుని వారిపై కేసులను నమోదు చేశారు. ఏ ముహూర్తాన పెళ్లి పెట్టుకున్నారో గానీ.. మండపంలోనే ఆ జంటలపై పోలీస్ కేసులు నమోదయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర గేట్ ప్రాంతంలోని ప్యాలెస్ కాంపౌండ్‌లో గులాబ్ బాగన్, మాణిక్య కోర్టు అనే రెండు వివాహ మండపాల్లో కరోనా నిబంధనలు పాటించకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయని తెలుసుకున్న ఆ జిల్లా కలెక్టర్‌, మేజిస్ట్రేట్ శైలేష్ కుమార్‌ యాదవ్.. మొదట తానొక్కడే ఓ అతిథిలా అక్కడికి వెళ్లారు. అక్కడ నిబంధనలకు గాలికి వదిలేసినట్లు కనిపించడంతో సిబ్బంది సాయంతో వారిపై చర్యలు తీసుకున్నారు. పెళ్లి నిర్వాహకులపైనే కాక వధూవరులు వారి కుటుంబ సభ్యులతో సహా అనేక మందిని అరెస్టు చేయాలని  ఆ కలెక్టర్‌ పోలీసులను ఆదేశించారు. అంతేకాదు, ఇంత జరుగుతున్నా పట్టించుకోరా అంటూ పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు కల్యాణ మండపాలపైనా డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద సంవత్సరానికి పైగా నిషేధం విధించారు. ప్రస్తుతం ఈ కలెక్టర్ చర్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

( చదవండి: ‘బరాత్‌’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌ )

మరిన్ని వార్తలు