వీడియో: మోదీ ఫొటోలు కావాలా?.. నిర్మలా సీతారామన్‌గారూ ఇదిగో.. వైరల్‌

3 Sep, 2022 18:07 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఫ్లెక్సీ ఏర్పాటు వ్యవహారం మరోసారి తెలంగాణను కుదిపేస్తోంది. టీఆర్‌ఎస్‌-బీజేపీల మధ్య మాటల తుటాలు పేల్చుకునేలా చేసింది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కామారెడ్డి బీర్కూర్‌ పర్యటనలో ఉచిత బియ్యం పంపిణీ వద్ద ప్రధాని ఫొటో ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనుషులొచ్చి వాటిని ఏర్పాటు చేస్తారని.. తొలగించకుండా చూసుకునే బాధ్యత మీదే అంటూ కలెక్టర్‌ జితేశ్‌ పాటిల్‌కు సూచించారు కూడా. ఈ వ్యవహారంపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కూడా తీవ్రంగానే స్పందించారు. అయితే.. టీఆర్‌ఎస్‌ మాత్రం ఆమె చెప్పినట్లే చేసిందట!. 

వంటగ్యాస్‌ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రాలీలో.. గ్యాస్‌ బండలకు ప్రధాని మోదీ ఫొటోలను అంటించి ఉన్నాయ్‌. ఆ ఫొటోల మీద మోదీజీ.. రూ.1105 అని రాసి ఉంది. పైగా ఫొటోలో మోదీ గట్టిగా నవ్వుతున్నట్లు స్టిల్‌ ఉంది. ఇది టీఆర్‌ఎస్‌ సెటైర్‌ చేష్టలనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌గారూ.. మీరు చెప్పినట్లే చేశామా? అంటూ టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు కొందరు ప్రస్తుతం ఈ వీడియోను స్ప్రెడ్‌ చేస్తున్నారు. 

గతంలో ప్రధాని మోదీ ఫ్లెక్సీల వ్యవహారం హైదరాబాద్‌ను కుదిపేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును ఉద్దేశించి బీజేపీ కార్యకర్తలు ‘సాలు దొర.. అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. కౌంటర్‌గా ‘సంపొద్దు మోదీ.. ’అంటూ టీఆర్‌ఎస్‌ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు నగరంలో. పలు సిగ్నల్స్‌ వద్ద ఏర్పాటు చేసిన ఈ భారీ ఫ్లెక్సీలు ఉద్రిక్తతలకు దారి తీయడంతో అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని వాటిని తొలగించారు.

ఇదీ చదవండి: అంతా మీ ఇష్టం అంటే నడవదు- నిర్మలా సీతారామన్‌ కౌంటర్‌ 

మరిన్ని వార్తలు