తాతా మనవళ్లను బలి తీసుకున్న ట్రక్కు
మహోబా(యూపీ): తాత, మనవడు వెళ్తున్న స్కూటీని ఓ ట్రక్కు ఢీకొట్టి, వారిని రెండు కిలోమీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది. ఈ ఘటనలో తాత, మనవడు ప్రాణాలు కోల్పోయారు. యూపీలోని మహోబా జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది.
ఉదిత్ నారాయణ్ చౌరాసియా(66) అనే విశ్రాంత ఉపాధ్యాయుడు, ఆయన ఆరేళ్ల మనవడు మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తుండగా స్థానిక బిజనగర్ మలుపులో ప్రమాదం జరిగిందని సీఐ రామ్ పర్వేశ్ రాయ్ చెప్పారు. తాత, మనవడు సహా ట్రక్కు కింద ఇరుక్కుపోయిన స్కూటీని ట్రక్కు రెండు కిలోమీటర్ల దూరం లాక్కెళ్లింది. స్థానికులు ట్రక్కును అడ్డగించి ఆపేశారు. చిద్రమైన తాత, మనవడి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు పంపారు.