గుంతలో పడి అదుపుతప్పిన బైక్‌.. లారీ తొక్కటంతో యువకుడు మృతి!

29 Aug, 2022 15:11 IST|Sakshi

ముంబై: రోడ్లపై పడిన గుంతలను సకాలంలో పూడ్చకుండా అధికారులు చేసిన నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. గుంత కారణంగా బైక్‌ అదుపుతప్పి లారీ టైర్‌ కింద పడి నుజ్జునుజ్జయ్యాడు ఓ యువకుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగింది. బాధితుడిని గణేష్‌ ఫాలే(22)గా గుర్తించినట్లు థానే మున్సిపల్‌ కర్పోరేషన్‌ ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు తెలిపారు.

అదుపుతప్పి లారీ టైర్ల కింద పడిపోయిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దివా-అగసాన్‌ రోడ్డులో యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. ఎదురుగా ట్యాంకర్‌ లారీ వస్తోంది. దీంతో పక్కనుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ మార్గంలో గుంత ఉంది. బైక్‌ వెనుక చక్రం అందులోకి వెళ్లగానే అదుపుతప్పింది. దీంతో లారీ వెనుక చక్రాల కింద పడిపోయాడు బాధితుడు. లారీ డ్రైవర్‌ చూసుకోకపోవటం వల్ల అతడిపై నుంచి వెళ్లింది. ఎదురుగా వస్తున్న కొందరు వెంటనే స్పందించి లారీ ఆపాలని సూచించారు. ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు తలెత్తాయి.

బాధితుడిని వెంటనే కల్వా సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చనిపోయినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌గా మారిన క్రమంలో మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన ఎమ్మెల్యే రాజు పాటిల్‌ ట్వీట్‌ చేశారు. రోడ్డుపై గుంతల కారణంగా ఓ వ్యక్తి మరణించాడని అధికారులపై విమర్శలు చేశారు. ఏక్‌నాథ్‌ షిండేకు ట్యాగ్‌ చేస్తూ రోడ్డు పనులు కేవలం పేపర్‌పైనే ఉన్నాయని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: వాహనదారులకు అలర్ట్‌: ఆ హైవేపై భారీ వాహనాలకు నిషేధం 

మరిన్ని వార్తలు