Twitter Grievance Officer: దిగొచ్చిన ట్విటర్‌.. ఢిల్లీ హైకోర్టు వార్నింగ్‌కు రిప్లై

8 Jul, 2021 13:21 IST|Sakshi

కొత్త ఐటీ చట్టాల ప్రకారం.. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, నెటిజన్ల పోస్టుల విషయంలో మరింత బాధ్యతయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉన్నతాధికారులను సైతం నియమించుకోవాల్సి ఉంటుందని కొత్త రూల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. అయితే గ్రీవెన్స్‌ రెడ్రెస్సల్‌ ఆఫీసర్‌(తాత్కాలిక ఫిర్యాదుల స్వీకరణ అధికారి)ను ట్విటర్‌ నియమించుకోకపోవడంపై ఢిల్లీ హైకోర్టు గరం అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం ట్విటర్‌ కోర్టుకి బదులిచ్చింది. 

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు వార్నింగ్‌తో ఎట్టకేలకు ట్విటర్‌ దిగొచ్చింది. ఎనిమిది వారాల గడువు ఇస్తే.. గ్రీవెన్స్‌ రెడ్రస్సల్‌ ఆఫీసర్‌ను నియమిస్తామని విన్నవించింది. అంతేకాదు ఇంటీరియమ్‌ చీఫ్‌ కాంప్లియెన్స్‌ ఆఫీసర్‌ను ఇదివరకే(రెండు రోజుల క్రితమే) నియమించామని, మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్‌ను కూడా నిర్ణీత కాలవ్యవధిలో.. అది కూడా కొత్త ఐటీ రూల్స్‌కు లోబడే నియమిస్తామని కోర్టుకు వెల్లడిస్తూ.. ఎనిమిది వారాల గడువు కోరింది. కాగా, ‘మీ ఇష్టం ఉన్నప్పుడు గ్రీవెన్స్‌ అధికారిని నియమిస్తామంటే ఊరుకునేది లేదు’ అంటూ హైకోర్టు రెండు రోజుల క్రితం జరిగిన వాదనల్లో ట్విటర్‌పై మండిపడింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌ సమాధానం ఇచ్చింది.  

ఇక ఈ మూడు పొజిషన్‌లకు కోసం జాబ్‌ ఓపెనింగ్స్‌ ప్రకటనలు ఇచ్చినట్లు ట్విటర్‌ వెల్లడించింది. ఇదిలా ఉంటే ట్విటర్‌ ఆ మధ్య నియమించిన తాత్కాలిక గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ ధర్మేంద్ర చాతుర్‌.. అనూహ్యంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ పొజిషన్‌లో భారత్‌కు చెందిన వాళ్లనే నియమించాలనే నిబంధన కూడా ఉంది. ఇదిలా ఉంటే ట్విటర్‌కు ప్రభుత్వానికి, పోలీసులకు మధ్య నోటీసులు, కేసులతో ఘర్షణ వాతావరణం కనిపిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నివారాల్లో ట్విటర్‌ మీద కేసులు కూడా నమోదు అవుతున్నాయి. అందులో చైల్డ్‌ పోర్నోగ్రఫీతో పాటు మ్యాప్‌లు తప్పుగా చూపించడం కూడా ఉన్నాయి.

మరిన్ని వార్తలు