Twitter దుందుడుకు చర్య: ఉపరాష్ట్రపతికి బ్లూటిక్‌ తొలగింపు

5 Jun, 2021 10:30 IST|Sakshi

ట్విటర్‌  ఓవర్‌ యాక్షన్‌

వెంకయ్య నాయుడు ఖాతాకు బ్లూటిక్‌  తొలగింపు

పెల్లుబుకిన ఆగ్రహం

సాక్షి, న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్‌ సైట్‌  ట్విటర్‌ దుందుడుకు చర్య  సోషల్‌ మీడియాలో దుమారం రేపింది. ఉపరాష్ట్రపతి  వెంకయ్య నాయుడు  వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాకు  బ్లూటిక్‌ను తాజాగా తొలగించింది.   6 నెలలుగా ఆయన ఖాతా యాక్టివ్‌గా లేని కారణంగా  అన్ వెరిఫై చేసి బ్లూ మార్క్ తొలగించినట్టు ట్విటర్‌ వెల్లడించింది. శనివారంఈ పరిణామం చోటు చేసుకుంది.  అయితే  దీనిపై నెటిజన్లు   తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్విటర్‌ వినియోగదారు పేరు  మార్చినా లేదా ఖాతా యాక్టివ్‌గా లేకపోయినా ఎలాంటి నోటీసు లేకుండా ఎప్పుడైనా  'ధృవీకరించబడిన' బ్లూ బ్యాడ్జ్ చిహ్నాన్ని తొలగిస్తామని ట్విటర్‌ తెలిపింది. ఉపరాష్ట్రపతి ట్విటర్ హ్యాండిల్ నుండి బ్లూ బ్యాడ్జ్ తొలగించడంపై బీజేపీ ముంబై అధికార ప్రతినిధి సురేష్ నఖువా గ  ట్విటర్‌ వేదికగా ఆగ్రహం  వ్యక్తం చేశారు.  'భారత రాజ్యాంగంపై దాడి' అని  వ్యాఖ్యానించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి జూలై 23, 2020 న పోస్ట్ చేసిన చివరి ట్వీట్‌ చేయగా, సుమారు 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, వైస్ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాకు 931,000 మందికి పైగా అనుచరులున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రకటించిన కొత్త ఐటీ నిబంధనలకు సంబంధించి  ట్విటర్‌కు కేంద్రానికి మధ్య  వివాదం నడుస్తోంది. ఇటీవల ఈ వార్‌  మరింత ముదిరిన సంగతి తెలిసిందే.

దిగొచ్చిన ట్విటర్‌
అటు బీజేపీ శ్రేణులు, ఇటు నెటిజనుల నుంచి తీవ్ర ఆగ్రహం పెల్లుబుకిన నేపథ్యంలో ట్విటర్‌ దిగొచ్చింది. ఉపరాష్ట్రపతి ట్విట్టర్ ఖాతా బ్లూ మార్క్‌ టిక్‌ను పునరుద్ధరించింది. 

>
మరిన్ని వార్తలు