కార్టూనిస్టు మంజుల్‌కు ట్విట్టర్‌ నోటీసు 

13 Jun, 2021 11:51 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత ఐటీ చట్టాలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో ప్రముఖ కార్టూనిస్టు మంజుల్, అల్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ జుబైర్, రిటైర్ట్‌ ఐఏఎస్‌ అధికారి సూర్యప్రతాప్‌ సింగ్‌కు ట్విట్టర్‌ యాజమాన్యం నోటీసు జారీ చేసింది. కొన్ని దర్యాప్తు సంస్థల ఆదేశాల మేరకు ఈ నోటీసు ఇచ్చినట్లు తెలిసింది. వారు చేసిన కొన్ని ట్వీట్లను ఖాతాల నుంచి తొలగించాలని దర్యాప్తు సంస్థలు సూచించినట్లు సమాచారం.

తమకు అందిన నోటీసు స్క్రీన్‌షాట్లను మంజుల్, జుబైర్, సూర్యప్రతాప్‌ సింగ్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఈ ముగ్గురికి నోటీసు ఇవ్వాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ సూచించలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఏయే ట్వీట్లపై ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది... సదరు ట్వీట్లను తొలగించమని కోరిన చట్ట సంస్థలు ఏవి అనే విషయాలు తెలియరాలేదు.  సదరు ట్వీట్లపై ప్రస్తుతానికి చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. ట్విట్టర్‌కు ఇండియాలో 1.75 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
చదవండి: కరీనా ఖాన్‌.. శూర్పణక రోలే కరెక్ట్‌ నీకు!
 

మరిన్ని వార్తలు