హెల్మెట్ లేకుండా స్కూటీపై మహిళా పోలీసులు.. ‘ఏంటి సర్‌.. ఇదే తప్పు మేం చేస్తే!’

9 Apr, 2023 20:04 IST|Sakshi

ముంబై: ద్విచక్రవాహనం నడిపేవారు హెల్మెట్ ధరించడం మన దేశంలో తప్పనిసరి.  ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది. మోటారు వాహన చట్టం సెక్షన్ 129లో ఈ నిబంధన ఉంది. దీంతో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుంది.

అయితే ముంబైలో ఇద్దరు మహిళా పోలీసులు హెల్మెట్ ధరించకుండానే స్కూటీ నడపడం చూసిన ఓ వ్యక్తి వెంటనే ఫొటో తీశాడు. ఓ సాధారణ పౌరుడు ఇలా చేస్తే ఉరుకుంటారా అని అధికారులను ప్రశ్నిస్తూ ఈ ఫొటోను ట్వీట్ చేశాడు. ఏకంగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో ముంబై పోలీసులను కూడా ట్యాగ్ చేశాడు.  ట్రాఫిక్ నిబంధనలు వీళ్లకు వర్తించవా? వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోరా అని ఫైర్ అయ్యాడు.

దీనిపై నెటిజన్లు కూడా స్పందించారు. ఈ మహిళా పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరేమో.. రూల్స్ ఎప్పుడూ సామాన్యులకే వర్తిస్తాయి, చట్టాలు చేసేవారికి,  చట్టపరిరక్షకులకు అవి వర్తించవు అని అసహనం వ్యక్తం చేశారు.సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరగడంతో ముంబై ట్రాఫిక్‌ పోలీసులు ఈ విషయంపై స్పందించారు. ఆ ఫొటో సరిగ్గా ఎక్కడ తీశారో చెప్పాలని పోస్టు చేసిన వ్యక్తిని అడిగారు. దీంతో అతడు ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్‌ హైవే (దాదర్) అని బదులిచ్చాడు.

అనంతరం ఈ మహిళా పోలీసులపై చర్యలు తీసుకుంటామని, మాతుంగా ట్రాఫిక్ డివిజన్ పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు జారే చేశామని చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్లు శాంతించారు.భారత్‌లో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే జరిమానా విధిస్తారు. ఇదే తప్పును పదే పదే రిపీట్ చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తారు. అరుదైన సందర్బాల్లో మూడు నెలల వరకు జైలు శిక్ష కూడా విధిస్తారు.
చదవండి: ఒక్క బైక్‌పై ఐదుగురు యువకులు.. ఇదేం సరదా.. మైండ్ దొబ్బిందా..?

మరిన్ని వార్తలు