ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసిన బీజేపీ ఎంపీలు

13 May, 2021 08:50 IST|Sakshi

కోల్‌కతా: ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు బీజేపీ పార్లమెంట్‌ సభ్యులు.. ఎమ్మెల్యేలుగా రాజీనామా చేశారు. రాణాఘాట్‌ నుంచి ఎంపీగా కొనసాగుతున్న లోక్‌సభ ఎంపీ జగన్నాథ్‌ సర్కార్, కూచ్‌ బెహార్‌ స్థానం నుంచి ఎంపీ అయిన నిసిత్‌ ప్రామాణిక్‌లు తమ రాజీనామా లేఖలను పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ స్పీకర్‌ బిమన్‌ బెనర్జీకి సమర్పించారు.

బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు రాజీనామా లేఖలు ఇచ్చినట్లు ప్రామాణిక్‌ చెప్పారు. జగన్నాథ్, ప్రామాణిక్‌లతోపాటు మరికొందరు ఎంపీలను బీజేపీ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దించింది. బబూల్‌ సుప్రియో, లాకెట్‌ ఛటర్జీ, రాజ్యసభ సభ్యుడు స్వపన్‌దాస్‌ గుప్తాలు ఎన్నికల్లో పోటీచేసినా ఓడిపోయారు.

‘2016లో మూడు సీట్లు గెల్చిన బీజేపీ ఈసారి ఎన్నికల్లో 77 చోట్ల విజయం సాధించింది. ఈసారి కొందరు ఎంపీలను బీజేపీ పోటీలో నిలిపింది. కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న మా పార్టీ లక్ష్యం నెరవేరలేదు’ అని జగన్నాథ్‌ సర్కార్‌ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసినంత మాత్రాన బెంగాల్‌లో బీజేపీ వ్యవస్థీకృతంగా బలహీనపడిందని అనుకోకూడదని ఆయన అన్నారు.
(చదవండి: ఆవిష్కరణ: కరోనాను చంపే మాస్క్‌ అభివృద్ధి)

మరిన్ని వార్తలు