ఎన్నేళ్ల నాటి పగ ఇది.. పాము కాటుకు కుటుంబంలో ఇద్దరు మృతి

4 Aug, 2022 22:49 IST|Sakshi

ఓ పాము కారణంగా వారి ఇంట విషాదం నెలకొంది. పాము కాటు కారణంగా అన్నదమ్ములిద్దరూ మృతి చెందారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.  వివరాల ప్రకారం.. బలరాంపూర్ జిల్లాలోని భవానీపూర్‌ గ్రామానికి చెందిన అరవింద్‌ మిశ్రా మంగళవారం పాము కాటు కారణంగా మృతిచెందాడు. ఈ క్రమంలో పంజాబ్‌లోని లూధియానాలో నివాసం ఉంటున్న తన తమ్ముడు గోవింద్‌ మిశ్రాకు ఈ విషయం తెలిసింది. దీంతో, అన్న అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంధువులతో కలిసి తన స్వగ్రామానికి వచ్చాడు. 

అయితే, అంత్యక్రియల అనంతరం రాత్రి వారి ఇంట్లో నిద్రపోతున్న గోవింద్‌ మిశ్రా, అతడి బంధువు చంద్రశేఖర్‌ పాండేను మరో పాము కాటు వేసింది. కాగా, పాము కాటు కారణంగా గోవింద్‌ మిశ్రా అక్కడికక్కడే మృతిచెందగా.. చంద్రశేఖర్‌ను ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, పాము కాటు కారణంగా రెండు రోజుల వ్యవధిలో అన్నదమ్ములిద్దరూ చనిపోవడంతో వారి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. పాములు వారి కుటుంబ సభ్యులను పగపట్టాయంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. 

ఇది కూడా చదవండి: ‘నా మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వద్దు’

మరిన్ని వార్తలు