కేరళలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌!

28 Sep, 2020 17:22 IST|Sakshi

తిరువనంతపురం: కాంగ్రెస్‌ పార్టీకి కేరళలలో మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖులు రాజీనామా చేశారు. దీంతో కేరళలో కాంగ్రెస్‌ పార్టీ సంక్షోభంలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎంపీ, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కన్వీనర్ బెన్నీ బెహానన్, కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశాలు లేకుండానే పార్టీకి రాజీనామా చేశారు. ఇక బెహానన్‌ పార్టీ నుంచి తప్పుకున్న కొద్ది సేపటికే మరొక ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కె. కరుణాకరన్‌ కుమారుడు కె. మురళీధరన్‌ కూడా  కేపీసీసీ మీడియా ప్రచార కమిటీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు . 2018 సెప్టెంబర్‌లో కేపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన ఆయన, 2019 సార్వత్రిక ఎన్నికలలో వటకర నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.

ఈ విషయంపై బెహానన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు లేకుండా రాజీనామా చేశానని చెప్పారు. పార్టీకి మంచి సేవలందించాలంటే నాయకులు ఒకటి కంటే ఎక్కువ పదవులలో ఉండకూడదని కేపీసీసీ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ సూచించిన తరువాత కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలోని ఒక విభాగం పార్లమెంటు సభ్యుడిగా ఉండటంతో పాటు బెహానన్  పార్టీ కన్వీనర్‌గా ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. 

సీనియర్ నాయకుడు, మాజీ కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీతో బెహానన్ భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారని ఆ నివేదికలలో పేర్కొన్నారు. 2018 లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు కన్వీనర్‌గా బెన్నీ బెహానన్ నియమితులయ్యారు. రాజీనామా తరువాత, మాజీ కేపీసీసీ అధ్యక్షుడు, ఊమెన్‌ చాందీ విధేయుడు ఎంఎం హసన్ ఈ పదవి చేపట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

చదవండి: ‘ఆ ఎంపీని తొలగించండి’

మరిన్ని వార్తలు