విమానంలో తాగి రచ్చ చేసిన ప్యాసింజర్లు.. చివరకు..

23 Mar, 2023 10:41 IST|Sakshi

దుబాయ్ నుంచి ముంబై వచ్చిన ఇండిగో విమానంలో తప్పతాగి రచ్చ రచ్చ చేశారు ఇద్దరు ప్యాసింజర్లు. తోటి ప్రయాణికులతో దరుసుగా ప్రవర్తించారు. మద్యం మత్తులో మితిమీరి రెచ్చిపోయారు. అడ్డుకోబోయిన విమాన సిబ్బందిని కూడా లెక్కచేయకుండా దుర్భాషలాడారు. మద్యం బాటిళ్లను వారి వద్ద నుంచి తీసేసేందుకు ప్రయత్నించగా.. గొడవకు దిగారు.

బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ ప్యాసింజర్లను దత్తాత్రేయ బపార్డేకర్, జాన్ జార్జ్ డిసౌజాగా గుర్తించారు. యాజమాన్యం వీరిపై ఫిర్యాదు చేయడంతో విమానం ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఆ తర్వాత వారు బెయిల్‌పై విడుదల అయినట్లు తెలుస్తోంది.

కాగా.. ఈ ఇద్దరు గల్ప్ దేశంలో ఏడాదిగా పని చేసి ఇంటికి తిరిగి వస్తున్న సందర్భంగా మందుబాటిళ్లు కొనుగోలు చేసి విమానంలోనే పార్టీ చేసుకున్నారు. ఇబ్బందిగా ఉందని చెప్పిన తోటి ప్యాసింజర్లతో వాగ్వాదానికి దిగడంతో విమానంలో గందరగోళ వాతావరణం నెలకొంది.

అయితే విమానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఏడాదిలో ఏడోసారి కావడం గమనార్హం. ఈ నెల మొదట్లోనే లండన్‌-ముంబై విమానంలో సిగరెట్ తాగిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే జనవరిలో ఢిల్లీ నుంచి పట్నా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్యాసింజర్ మద్యం తాగి రచ్చ చేశాడు. గతేడాది డిసెంబర్‌లో కొంతమంది ప్యాసింజర్లు విమానంలోనే ఘర్షణకు దిగిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
చదవండి: ఆరేళ్లుగా కాపురం.. ఇద్దరు పిల్లలు.. భార్య తన సొంత చెల్లి అని తెలిసి భర్త షాక్..!

మరిన్ని వార్తలు