షాక్‌లో కుటుంబీకులు.. ఠాణాకు చేరిన పంచాయతీ

8 Feb, 2021 18:11 IST|Sakshi

ధన్‌బాద్‌: చిన్నప్పటి స్నేహం కాస్త ప్రేమ అయ్యింది. చివరకు ఒకరంటే ఒకరికి ప్రాణమయ్యారు. చివరకు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇందులో ఏమీ వింత ఉంది అనుకుంటున్నారా. పెళ్లి చేసుకుంది యువతి యువకుడు కాదు. ఇద్దరు అమ్మాయిలే. పైగా వారిద్దరికి 18 ఏళ్లు కూడా నిండలేదు. ప్రస్తుతం వీరి ప్రేమపెళ్లి పోలీస్‌ స్టేషన్‌కు చేరింది.

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ ప్రాంతంలో సుగాయ్‌దిహ్‌ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. ఈ క్రమంలోనే వారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయాన్ని వారి ఇళ్లల్లో చెప్పగా షాక్‌కు గురయ్యారు. వారి పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించి అది తప్పని, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

దీంతో అందులో ఒకమ్మాయి అబ్బాయిగా వేషం మార్చింది. షర్ట్, ప్యాంట్ వేసుకుని పురుషుడిలా కనిపించింది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని స్నేహితులను సంప్రదించారు. వారికి సహకరించేందుకు ఎవరూ ముందుకు రాకపోగా తిరస్కరించారు. దీంతో వారిద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం ఇంట్లో చెప్పకుండా ఇద్దరు వారి ఇళకు వెళ్లిపోయారు. అయితే తాళి కట్టించుకున్న అమ్మాయి మెడలో సోమవారం మంగళసూత్రం చూసిన ఆమె తల్లి ప్రశ్నించింది. తాళి ఎవరు కట్టారని గద్దించి అడగడంతో జరిగిన విషయం చెప్పింది. వారు వెంటనే సరాయిధేలా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు వివరించారు.

18 ఏళ్లు నిండకపోవడంతో వారిని తల్లిదండ్రుల వద్ద ఉండమని చెప్పగా ఆ అమ్మాయిలు నిరాకరించారు. తామిద్దరం కలిసి ఉంటామని చెప్పారు. అయితే వివాహ వయసు దాటాక మీ ఇష్టమని తాత్కాలికంగా చెప్పి పంపారు. వారి మనసుల మాదిరి వారిద్దరి పేర్లు కూడా ఒకటే. వారి ఇద్దరి పేర్లు పూజ కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు