చెలరేగిన చిరుతలు..

6 Nov, 2020 09:45 IST|Sakshi

తుమకూరు, కొప్పళ జిల్లాల్లో ఇద్దరు బలి 

తుమకూరు(కర్ణాటక): రాష్ట్రంలో గురువారంనాడు చిరుతపులులు విరుచుకుపడ్డాయి. తుమకూరు, కొప్పళ జిల్లాల్లో చిరుతల దాడుల్లో ఒక మహిళ, యువకుడు ప్రాణాలు కోల్పోయారు. తమకూరు జిల్లా గుబ్బి తాలూకా సీఎస్‌ పుర హోబళి మణికుప్ప గ్రామంలో 48 ఏళ్ల భాగ్యమ్మ అనే మహిళ చిరుత చేతిలో మృత్యువాత పడింది. ఆమె ఉదయం పశువులను సొంత పొలానికి తోలుకెళ్లింది. ఈ సమయంలో ఎక్కడి నుంచో ఒక చిరుత మీద పడి గొంతు కొరికేసింది. పక్క పొలాల్లోనివారు గట్టిగా కేకలు వేస్తూ రావడంతో చిరుత పరారైంది. అప్పటికే ఆమె కన్నుమూసింది. ఈ ప్రాంతంలో పలుమార్లు చిరుత దాడులు జరుగుతున్నా అటవీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు.      

నిద్రిస్తున్న యువకున్ని చంపి భక్షణ  
గంగావతి: తాలూకాలోని ఆనెగుంది సమీపంలో మేగోటె దుర్గాదేవి ఆలయ గోశాల వద్ద నిద్రిస్తున్న ఓ యువకునిపై చిరుతపులి దాడి చేసి హతమార్చిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. దేవస్థానంలో వంట పని, గోశాల పశువులను చూసుకునే హులిగప్ప(23) అనే యువకుడు గోశాల వద్ద నిద్రిస్తుండగా చిరుత దాడి చేసింది. అతన్ని నోట కరుచుకుని గుహలోకి తీసుకెళ్లి చంపి గొంతు, కుడి కాలు తొడను తినేసింది. ఇటీవల చిరుత బెడద ఎక్కువై నెల రోజుల్లోనే ఇద్దరు మహిళలతో పాటు ఇదే దేవస్థానం వద్ద హైదరాబాద్‌కు చెందిన బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనలు జరిగాయి. కొప్పళ ఎంపీ కరడి సంగణ్ణ ఘటనాస్థలాన్ని పరిశీలించి రూ.7 లక్షల పరిహారం ఇప్పిస్తామని కుటుబ సభ్యులకు హామీ ఇచ్చారు.   

మరిన్ని వార్తలు