15 రోజుల్లో ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తారు: బీజేపీ 

9 Apr, 2021 00:48 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో రెండు వారాల్లోపు మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తారని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్‌ గురువారం జోస్యం చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తనను సర్వీస్‌లో కొనసాగించేందుకు రూ. 2 కోట్లు డిమాండ్‌ చేశారని సస్పెండైన పోలీస్‌ అధికారి సచిన్‌వాజే బుధవారం ఆరోపణలు చేశాడు.

అలాగే, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయాలని మరో మంత్రి, శివసేన నాయకుడు అనిల్‌ పరబ్‌ తనను ఆదేశించారని వాజే వెల్లడించారు. వాజే ఈ ఆరోపణలు చేసిన మర్నాడు పాటిల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తనపై వచ్చిన ఆరోపణలను అనిల్‌ పరబ్‌ తోసి పుచ్చారు. ఈ నేపథ్యంలో ‘రాష్ట్రంలో భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఎవరైనా ఊహించగలరు. ఇద్దరు మంత్రుల అవినీతిపై కొందరు కోర్టుకు వెళ్తారు. ఆ మంత్రులు మరో 15 రోజుల్లో రాజీనామా చేస్తారు’ అని చంద్రకాంత్‌ పాటిల్‌ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర

►శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆగ్రహం

ముంబై: మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర పన్నుతున్నారని, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు సాగబోవని హెచ్చరించారు. జైల్లో ఉన్న వారి నుంచి లెటర్లు రాసుకొచ్చే కొత్త ట్రెండ్‌ నడుస్తోందని విమర్శించారు.  వ్యక్తిత్వ హననానికి, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను, ఆదాయపు పన్ను శాఖను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రూ.2 కోట్లు డిమాండ్‌ చేశాడని సస్పెండైన పోలీసు అధికారి సచిన్‌ వాజే బు«ధవారం ఆరోపించిన విషయం తెలిసిందే. 

   

మరిన్ని వార్తలు