భారత్‌లో ఒమిక్రాన్‌ కలకలం

2 Dec, 2021 16:43 IST|Sakshi

Omicron variant detected in India, two positive cases in Karnataka ఒమిక్రాన్‌ వేరియంట్‌ భారత్‌లో ప్రవేశించింది. తాజాగా.. భారత్‌లో రెండు కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తవైరస్‌ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. కాగా, వీరికి తీవ్రమైన లక్షణాలు లేనట్లు పేర్కొన్నారు. గత నెల 11, 12 తేదీల్లో వీరిద్దరూ విదేశాల నుంచి వచ్చినట్లు లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

వైరస్‌ సోకిన ఇద్దరు పురుషుల్లో ఒకరికి 46, మరోకరికి 66 ఏళ్లని కేంద్రం తెలిపింది. వైరస్‌ సోకిన ఇద్దరిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో తరలించినట్లు కేంద్రం తెలిపింది. కాగా, ఒమిక్రాన్‌ సోకినవారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ ట్రేస్‌ చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే, వీరిద్దరిలో తీవ్రమైన లక్షణాలు లేవని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

కేరళ, మహారాష్ట్రలలో 10,000 కంటే ఎక్కువ కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని..  దేశంలోని 55 శాతం కేసులు ఈ రెండు రాష్ట్రాల్లో నమోదయ్యాయని చెప్పారు. వారంవారీ కోవిడ్-19 పాజిటివిటీ రేటు 15 జిల్లాల్లో 10 శాతం కంటే ఎక్కువ.. 18 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్య ఉందన్నారు.  ఇప్పటికే ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. (Omicron: మరో వుహాన్‌.. అక్కడ 90 శాతం కరోనా కేసుల్లో ‘ఒమిక్రాన్‌’)

ఇప్పటివరకూ 29 దేశాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగుచూడగా, 373 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ దాదాపు సద్దుమణిగిందనుకున్న తరుణంలో ఒమిక్రాన్‌గా రూపుమార్చుకుని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వేరియంట్‌ భారత్‌లో ప్రవేశించకుండా కేంద్రం ముందుగానే చర్యలు చేపట్టినప్పటికీ రెండు కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. 

ఒమిక్రాన్‌ పై ప్రధాని మోదీ అత్యవసర సమీక్ష..

న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌ వైరస్‌పై ప్రధాని నరేంద్రమోదీ అధికారులతో అత్యవసరంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్‌లో రెండు ఒమిక్రాన్‌ కేసులు బయటపడిన విషయం తెలిసిందే.  ప్రస్తుత పరిస్థితిని ఆరోగ్యశాఖాధికారులు మోదీకి వివరించారు. ప్రజలందరు మాస్క్‌ ధరించాలని, కరోనా నిబంధనలను పాటించాలని మోదీ సూచించారు.  

మరిన్ని వార్తలు