పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు

7 Dec, 2020 15:43 IST|Sakshi

జార్ఖండ్‌ : ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఇద్దరు అమ్మాయిలు పెద్దలను ఎదురించి, ఇంటి నుంచి పారిపోయి ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌, కొదెర్మ జిల్లాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో వారికి ఈ విషయం చెబితే ఒప్పుకోరని భావించారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఇంటినుంచి బయటకు వచ్చేశారు. నవంబర్‌ 8వ తేదీన గుడిలో పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం వారి ఇళ్లకు ఆరు కిలోమీటర్ల దూరంలోని చంద్రచౌక్‌ ప్రాంతంలో ఇళ్లు అద్దెకు తీసుకుని కాపురం మొదలుపెట్టారు. ( కోవిడ్‌ సెంటర్లో పెళ్లి.. వీడియో వైరల్‌ )

వీరు చంద్రచౌక్‌లో ఉంటున్నారని తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు అక్కడికి చేరుకుని గొడవ చేశారు. ఇద్దరు అమ్మాయిలు మేజర్లు కావటంతో పోలీసులు జోక్యం చేసుకోమని చెప్పి వెళ్లిపోయారు. దీనిపై ఆ అమ్మాయిలు మాట్లాడుతూ.. ‘‘ దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని మమ్మల్ని మా కుటుంబాలు బెదిరిస్తున్నాయి. మేం దాన్ని లెక్క చేయం. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న మేము గుడిలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యాం. త్వరలో మా పెళ్లిని కోర్టు ద్వారా చట్టబద్దం‌ చేయటానికి ప్రయత్నిస్తామ’’ని చెప్పారు.
 

మరిన్ని వార్తలు